బెజవాడ రా! నేను టీలో, నువ్ ఏపీలో: కేసీఆర్కు బాబు
హైదరాబాద్: కృష్ణా జిల్లా రాజధాని విజయవాడలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ రైతుల పక్షాన పోరాడుతానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం వెంటనే స్పందించారు.
ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ సీఎం వ్యాఖ్యలను చంద్రబాబు స్వాగతించారు. ఎవరైనా ప్రజల పక్షాన పోరాడితే మంచిదేనని వ్యాఖ్యానించారు.
తాను తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతున్నానని, అలాగే కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావొచ్చునని తెలిపారు. అయితే, కేసీఆర్ మాటలు ప్రజలు నమ్ముతారా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు విషయంలో చేతకాక కేసీఆర్ తన పైన, కేంద్రం పైన అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు తెలంగాణ టీడీపీ నేతలు కూడా కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇన్నాళ్ల పాటు విద్యుత్ కోసం ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అప్పుడే వెళ్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అసమర్థతను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు.
టీడీపీ కార్యాలయంలో ఎర్రంనాయుడు వర్థంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఎర్రం నాయుడు వర్ధంతి కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. చంద్రబాబు... ఎర్రం నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి ఆర్పించారు. ఎర్రం నాయుడు పార్టీకి చేసిన సేవాలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఎర్రం నాయుడు మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన అందరితో కలుపుగోలుగా ఉండడం, కార్యకర్తను చాలా ప్రేమగా పలుకరించడం, ఏ ఇబ్బంది వచ్చినా... అది తనకు వచ్చిన ఇబ్బందిగా భావించి వాళ్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారని కొనియాడారు.