చంద్రబాబు ప్రధాని, వెంకయ్య రాష్ట్రపతి: రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అవుతారని ఆయన అన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని కూడా ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటారని ఆయన చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు లివింగ్ లెజెండ్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదనే విమర్శలో నిజం లేదని అన్నారు.
యాత్రలతో కాలక్షేపం
టిడిపి ప్రభుత్వం జనచైతన్య యాత్రంలతో కాలయాపన చేస్తోంది తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని కడప జిల్లా కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్సించారు. మంగళవారం ఆయన కమలాపురంలో మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పాలనలో రాష్ట్రం తిరోగమన దశలో పయనిస్తోందని, అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు రాజధాని పేరుతో కాలయాపన చేసిన నేతలు ఇప్పుడు జనచైతన్య యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.