‘అమరావతి’ శంకుస్థాపనకు మోడీతో పాటు లక్షమంది: పత్తిపాటి, చీపురు పట్టనున్న బాబు
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు లక్షమందితో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధానికి భూమిపూజ జరుగుతుందన్నారు.
గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నవరాత్రుల తరహాలో రాజధాని శంకుస్థాపన వేడుకలను అక్టోబర్ 22 నుంచి నిర్వహిస్తామన్నారు. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్, జపాన్ ప్రధానులు విచ్చేయనున్నట్లు తెలిపారు.
పదివేల గ్రామాల నుంచి రైతులను ఆహ్వానిస్తున్నామని మంత్రి చెప్పారు. మరో రెండు రోజుల్లో శంకుస్థాపన ప్రదేశం, ముహూర్తంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

కాగా, రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా 200 ఫిర్యాదులు కూడా రాలేదని తెలిపారు. రుణమాఫీలో ఇప్పటికీ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు. పెండింగ్ దరఖాస్తులను తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకులకు సూచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
చీపురు పట్టనున్న చంద్రబాబు
ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో చీపురు పట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ తరహాలో చంద్రబాబు ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్'కు శ్రీకారం చుడుతున్నారు.
శుక్రవారం నుంచి వారం పాటు ఏపీ వ్యాప్తంగా పరిశుభ్రతా వారోత్సవాలకు ఏపీ సర్కారు కార్యాచరణ రూపొందించింది. నగరాల నుంచి గ్రామాల వరకు వారం పాటు ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమాలపై గురురవాం ఆయన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications