మరో రెండు మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయం:కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ:మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమని ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగర భాజపా అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజధాని భూములతో చంద్రబాబు భూ వ్యాపారం చేస్తున్నారని...తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబుది అన్నం పెట్టే చేయినే నరికే పద్దతి అని...కేంద్రాన్ని కూడా అలాగే మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. రాష్ట్రంలో పచ్చ కండువా కప్పుకున్న వారికే నిధులు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ధ్వజమెత్తారు.
కేంద్రం అమరావతి నిర్మాణానికి 2,500కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాలుగు భవనాలు కూడా కట్టలేదన్నారు. అంతేకాదు రాజధాని నిర్మాణం కోసమంటూ రైతుల నుంచి తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని తేల్చేశారు. అమరావతి నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు ఏమయ్యాయో చంద్రబాబు వెల్లడించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
మరోవైపు విజయవాడలో సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని, కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎపిలో రెండు కోట్ల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. చంద్రబాబు విదేశాల్లో చెప్పిన అబద్ధాలను ఇక్కడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు,లోకేష్ నిరుద్యోగ భృతి అంటున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పవన్కు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు.