సచివాలయానికి వస్తా, రానని చెప్పలేదు: బాబు
హైదరాబాద్: తాను సచివాలయానికి రానని చెప్పలేదని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయానికి రానని ఎవరు చెప్పారని ఆయన అడిగారు. శుక్రవారంనాడు ఆయనను సచివాలయ ఉద్యోగులు కలిశారు. తాను సచివాలయంలోని హెచ్ బ్లాక్ నుంచి పనిచేస్తానని ఆయన చెప్పారు.
ఉద్యోగుల పంపకాలపై ఆందోళన అక్కరలేదని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. బిల్లులో పేర్కోన్న ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. సచివాలయానికి రాబోనని తాను ఎవరితోనూ చెప్పలేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం నాయకులు అశోక్ బాబు, మురళీ కృష్ణ కూడా చంద్రబాబును కలిశారు. ఉద్యోగుల పంపకం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
కెసిఆర్ వ్యాఖ్యలను పట్టించకోవాల్సిన అవసరం లేదని అశోక్ బాబు, మురళీకృష్ణ చెప్పారు. నిబంధనల మేరకే ఉద్యోగుల విభజన జరుగుతుందని వారన్నారు. తమ సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.