విభజన ఏకపక్షం: ప్రధానికి చంద్రబాబు ఘాటు లేఖ
హైదరాబాద్: రాజ్యాంగ ప్రక్రియను కాదని, ఏకపక్షంగా ఆంధ్ర ప్రదేశ్ను విభజించదలచడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘాటైన లేఖ రాశారు. అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న డిమాండును ఆయన ఈ లేఖలో మరోసారి ప్రస్తావించారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రజలతో ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులతో, ఇంకా జెఎసి నాయకులతో చర్చించాలని ఆయన సూచించారు.
మొత్తం ఐదు అంశాలుగా చంద్రబాబు ఈ లేఖను రాశారు. మొదటి భాగంలో ఏ పరిస్థితులలో 2008లో తాము లేఖ ఇచ్చిందీ ఆయన వివరించారు. సమన్యాయం గురించి గతంలోనే ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్లాలన్నామని, కాని ఆ ప్రకారం జరుగుతున్నట్టు లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగపరంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇప్పుడు అదేమీ జరగలేదని, కాని గతంలో అలా జరిగిందని కూడా ఆయన మరో భాగంలో వివరించారు. ఎన్డిఏ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామ్యపక్షాలతో చర్చించారని, అప్పట్లో అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు విభజన ప్రక్రియ సామరస్యంగా జరిగిందని ఆయన చెప్పారు.
తెలంగాణాపై ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఆంటొనీల నాయకత్వంలో నాలుగు కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు ఈ లేఖలో ప్రస్తావిస్తూ శ్రీకృష్ణ కమిటీ లోతుగా అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తే కేంద్రం వాటిని పట్టించుకోనేలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణాను కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలోనే చూస్తోందని విమర్శిస్తూ రాజకీయ స్వప్రయోజనాలకోసమే విభజన అంశాన్ని ఆ పార్టీ ముందుకు తెచ్చిందని, స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఈ పాచిక వేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు అయినందువల్లే కాంగ్రెస్ ఈ రకంగా కుత్సిత వ్యూహంతో ముందుకు వెళ్తోందని ఆయన దుయ్యబట్టారు.
దేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ, తమ సొంత ప్రజా ప్రతినిధుల మాటలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడంలేదని చంద్ర బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో ప్రధాని సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.