కాపుల మీదకు బీసీలను రెచ్చగొడుతోన్న చంద్రబాబు : అంబటి రాంబాబు
విజయవాడ : ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షం సహా పలువురు కాపు నేతలు సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో.. కాపులను బీసీల్లో చేరుస్తామని హామి ఇచ్చిన చంద్రబాబే ఇప్పుడు రెండు కులాల మధ్య కుంపటి పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు బీసీలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ వెళ్లే ప్రతీ చోట టీడీపీ నేతలు గొడవలకు దిగుతుండడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పుకొచ్చారు అంబటి. బీసీలకు నష్టం వాటిల్లకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు ప్రజలు కోరుకుంటున్నారని అంబటి తెలిపారు. ఇచ్చిన హామి మేరకు కాపులను ఖచ్చితంగా బీసీ జాబితాలో చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు అంబటి.