చాంద్రాయణగుట్ట కంచుకోట: అక్బరుద్దీన్కు గట్టి పోటీ
హైదరాబాద్: హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట మజ్లీస్ పార్టీకి కంచుకోట. ఒక్కసారి తప్ప మిగతా అన్ని ఎన్నికల్లోనూ మజ్లీస్ విజయబావుటా ఎగురేసింది. ఇక్కడ ప్రధాన పోటీ మజ్లీస్, ఎంబిటీ మధ్యనే ఉంటుంది. ఈసారి కూడా గతంలో పోరాడినవారే మళ్లీ పోరాడుతున్నారు. వరుసగా నాలుగోసారి గెలిచి తన సత్తాను నిరూపించాలని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ పట్టుదతో ఉన్నారు. అయితే అక్బర్ను ఓడించాలని అమానుల్లాఖాన్ తనయుడు ఖయంఖాన్ చెమటోడుస్తున్నారు.
చారిత్రక దేవాలయాలు, దర్గాలకు చాంద్రాయణగుట్ట ప్రఖ్యాతి గాంచింది. ఓట్లపరంగా, విస్తీర్ణం పరంగా పెద్దదైన ఈ నియోజకవర్గంలో పునర్విభజనకు ముందు హిందువుల ఓట్లు కీలకంగా ఉండేవి. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర రక్షణ సంస్థలు అధికంగా ఉన్న చాంద్రాయణగుట్టలో నిరుపేదల ఓట్లే కీలకం. నియోజకవర్గంలోని లలితాబాగ్, రియాసత్నగర్, కంచన్బాగ్, బండ్లగూడ ప్రాంతాల్లో ఎక్కువగా తోపుడు బండ్లు, ఫుట్పాత్ వ్యాపారులు, చిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు జీవిస్తారు. వారే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తారు.
అమానుల్లాఖాన్ బరిలో ఉన్నంత వరకు మజ్లిస్ తరఫున పోటీ చేసినా, ఎంబిటీ తరఫున పోటీ చేసినా ఇక్కడ గెలుపు ఆయనదే. 1978 నుంచి 1994 వరకు వరుసగా ఆయన ఐదుసార్లు విజయం సాధించారు. మజ్లీస్తో విభేదించి ఆయన ఎంబిటీని స్థాపించారు. ఆయన 1999లో తొలిసారిగా అక్బరుద్దీన్ చేతిలో పరాజయం పాలయ్యారు.
అమానుల్లా తర్వాత ఆయన పెద్ద కుమారుడు డాక్టర్ ఖయంఖాన్ రంగంలోకి దిగారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన అక్బర్ను ఢీకొన్నా ఆయన ఓడిపోయారు. ఈసారి ఖయంఖాన్ సభలకు పెద్దఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. దీంతో అక్బర్ కూడా నిత్యం పాదయాత్రలు చేస్తూ, సభలు పెడుతున్నారు. బీఆర్ సదానం ద్ ముదిరాజ్ (కాంగ్రెస్), ప్రకాశ్ ముదిరాజ్ (తెలుగుదేశం), ముప్పిడి సీతారామిరెడ్డి ( తెరాస) తదితరులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల ఈ అభ్యర్థులు చాంద్రాయణగుట్టలో నామమాత్రమే