10 తర్వాత మార్పులు, కిరణ్ పక్కన నేనే: దామోదర
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం అన్నారు. విభజన బిల్లు ముసాయిదాపై శాసనసభలో చర్చ జరగాలని, అలాకాకుండా సమైక్యతీర్మానం పెడతామంటే తానే అడ్డుకుంటానని చెప్పారు. సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీటు పక్కనే తన సీటు ఉంటుందన్నారు.
సమైక్య తీర్మానం గురించి ప్రతిపాదించి న వెంటనే అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. ఫిబ్రవరిలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని కేంద్రమంత్రి జైరాం రమేశ్, విపక్ష నేత లాల్ కృష్ణ అద్వానీ చెప్పిన తర్వాత కూడా విభజన జరగదని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందనని, ఇంకా తెలంగాణను అడ్డుకుంటామనడం అవివేకమన్నారు.
ఈ నెల 10వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు జరుగుతాయని, ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. బిల్లుపై చర్చ జరగకపోతే సీమాంధ్ర ప్రాంతానికే నష్టమని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రాంతానికే లాభమని అన్నారు. శాసన సభను 23వ తేదీ వరకూ ఇదే విధంగా కొనసాగించి తర్వాత మళ్లీ గడువు పొడిగించాలని కోరితే రాష్ట్రపతి ఇచ్చే అవకాశం ఉండదన్నారు.
సీమాంధ్రులు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే ఆ ప్రాంతానికి నష్టం చేసిన వారవుతారన్నారు. ఇలాంటి ఎత్తుగడలతో ముఖ్యమంత్రికిరణ్ హీరో కాలేరని, జీరో అవుతారన్నారు. కిరణ్ వద్ద రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఎలాంటి రాజకీయ వ్యూహాలూ లేవని వీలైనంత ఎక్కువ కాలం, అంటే మార్చి వరకూ సిఎంగా కొనసాగాలన్నదే ఆయన ధ్యేయమన్నారు. ఆ ఆశ నెరవేరుతుందో లేదో తెలియదన్నారు.