దొంగ దందాకి చెక్.!నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు చసిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్.!
శ్రీకాకుళం/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ఏరులై పారుతోంది. ఏరులై పారుతున్న మద్యం అసలుదో నకిలీదో గుర్తించడం కూడా కష్టంగా మారింది. పోలీసులకు దొరికేంత వరకూ దందా యధేఛ్చగా సాగించుకోవచ్చని, దొరికిన తర్వాత ఆలోచించొచ్చు అనే ధోరణిలో సకిలీ మద్యం దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మాయగాళ్లకు చెక్ చెప్పి నకిలీ మద్యం దందాను అడ్డుకున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అంతరాష్ట్ర దాడుల్లో భాగంగా నకిలీ మద్యం తయారీ స్థావరాని గుట్టు రట్టు చేశారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
ఏపీలో నకిలీ మద్యం దందా.. రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
ఇక ఇదే అంశంపై జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో నకిలీ మద్యం తయారీ విధానం, తయారికి ఉపయోగించే సామాగ్రి వివరాలను ఎస్పీ అమిత్ బర్ధార్ వివరించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సెబ్ స్టేషన్, సోంపేట వారి సిబ్బందితో కలసి ముందుగా వచ్చిన సమాచారం మేరకు సోంపేట మండలం బురాగం గ్రామంలో మెకానిక్ షెడ్ వద్ద జాతీయ రహదారికీ 50 మీటర్ల దూరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలొ ఒక బోలెరో పికప్ వాహనాన్ని సిబ్బంది సహాయం తనిఖీ చేయగా, అందులో కొన్ని కార్డ్ బోర్డు బాక్సులు, లిక్కర్ బాటిల్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారని ఎస్పీ వివరించారు.
అమ్మకం ఏపిలో.. తయారీ ఒడిశాలో.. తెలివి మీరిన కేటుగాళ్లు..
అనుమానంతో వాహనాన్ని మొత్తం తనిఖీ చేయగా 25 కార్డ్ బోర్డు బాక్సులలో మొత్తం 1200 లిక్కర్ బాటిల్లు ఉన్నాయని, అవి ఒక్కక్కటి 180ఎంఎల్ పలిక్కర్ తో నింపి ఉన్నాయని తెలిపారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా వారు ఒడిశా రాష్ట్రం బరంపుర్, కన్హేపుట (మొహాడ) గంజమ్ జిల్లా నుండి వస్తున్నట్టు వివరించారు. స్పిరిట్ సహాయంతో రంగులు కలిపి రాయల్ స్టాగ్ మరియు, ఇంపీరియల్ బ్ల్యూ సీసాలలో నింపి వాటిని సోంపేట మండలం పరిధిలో గల గ్రామాల్లో విక్రయించేందుకు వస్తున్న క్రమంలో పట్టుబడినట్టు ఎస్పీ స్పష్టం చేసారు. అదే ప్రాంతంలో ఒక మోటార్ సైకల్ పైన అదే వాహనాన్ని అనుసరిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ దృవీకరించారు.
అచ్చం ఒరిజినల్ లిక్కర్.. తాగిన తర్వాత డూప్లికేట్
అంతే కాకుండా మోటార్ వాహనం సీజ్ చేసామని, పట్టుబడిన నలుగురు వ్యక్తులను ప్రశ్నించగా, వారిచ్చిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం బరంపుర్, కన్హేపుట, గంజమ్ జిల్లాకు వెళ్ళి ఒడిశా రాష్ట్ర పోలీసు సహాయంతో సదరు ప్రదేశాన్ని తనీఖి చేయగా అక్కడ 384 మధ్యం సీసాలు, మద్యం సీసాలకు అతికించే లేబుల్స్, నకిలీ మద్యం తయారీ యంత్రం, నకిలీ కప్పులు, నకిలీ లేబిల్ మిషన్, నకిలీ బార్ కోడ్ స్టికర్స్, ఇన్వెంటర్ బ్యాటరీ, రంగునీళ్లు, ఖాళీ సీసాలు, మోటర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మొత్తంగా సుమారు 285 లీటర్ల నకిలీ మద్యం, 1574 క్వార్టర్ బాటిల్స్,15 లీటర్ల స్పిరిట్ సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆరోగ్యాలకు ఎంతో హానీకరం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ
స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం విలువ మొత్తం కలిపి సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇలాంటి నకిలీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని, తక్కువ ఖరీదు నకిలీ మద్యం సేవించ రాదని జిల్లా ఎస్పి ప్రజలను కోరారు. నకిలీ మద్యం తయారీ స్థావరాల వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి, నకిలీ మద్యం తయారీ దందాను అరికట్టేందుకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ. కె. శ్రీనివాసరావు, అస్సిస్టెంట్ కమిషనర్ కె.గోపాల్ పాల్గొన్నారు.