ఏలూరు ఆస్పత్రిలోనే చేగొండి దీక్ష-బందరులో కాపుల సంఘీభావ దీక్ష-జనసేన, రాధా టీమ్ సపోర్ట్..
కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు సంఘీభావం లభిస్తోంది. పవన్ ఇప్పటికే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.
హరిరామజోగయ్య చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కాపు సంఘాలు దీక్షకు దిగాయి.
మచిలీపట్నంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకట్రావ్ జోగయ్య దీక్షకు మద్దతుగా దీక్ష చేపట్టారు. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ హరిరామ జోగయ్య చేస్తున్న డిమాండ్ కు మద్దతుగా దీక్షకు దిగినట్లు వెంకట్రావు తెలిపారు. హరిరామ జోగయ్య దీక్షను తాను కొనసాగిస్తానంటూ మచిలీపట్నం బ్రహ్మపురంలోని తన నివాసంలో వెంకట్రావ్ దీక్షకు కూర్చున్నారు. దీంతో దీక్షాస్థలి వద్దకు కాపు సంక్షేమ సేన నాయకులు, కార్యకర్తలు, రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు భారీగా చేరుకున్నారు.

హరిరామ జోగయ్య అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో జోగయ్య చేస్తున్న పోరాటం చూసి 50ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్యాంట్లు తడుపుకుంటున్నారని మహేష్ ఆరోపించారు. ఈబీసీ రిజర్వేషన్లు లో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని గత ప్రభుత్వంలోనే తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి పదేపదే విషం చిమ్ముతున్నారని విమర్శించారు. వైయస్ఆర్సీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్సీలు జోగయ్య ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే కాపు ద్రోహులేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications