ముద్రగడవి వైసీపీ లేఖలే-పవన్ తో నీకు పోటీనా ? హరిరామజోగయ్య ఘాటు కౌంటర్..
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కాపు నేతల మధ్య చిచ్చు రాజేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంపై చేసిన విమర్శలు, దానికి ప్రతిగా ఆయన రాస్తున్న లేఖలు ఓవైపు కలకలం రేపుతుండగా.. ఇప్పుడు ముద్రగడను కౌంటర్ టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ స్ధాయికి ముద్రగడ సరిపోరని, జగన్ కోసమే ఆయన లేఖలు రాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన హరిరామ జోగయ్య.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి ముద్రగడ పద్మనాభం కు లేదన్నారు. నీకు పవన్ కళ్యాణ్ కి పోలికా పద్మనాభం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పత్తిపాడులో నీ పైన పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఒక జన సైనికుడిని నిలబెట్టినా ఆయనే గెలుస్తాడన్నారు.

పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తే వేల మంది వస్తారు, అదే పద్మనాభం రోడ్డుపైకి వస్తే పదిమంది కూడా రారని జోగయ్య ఎద్దేవా చేశారు.పద్మనాభం వైసీపీ నేతలు నుండి వచ్చే లేఖలను విడుదల చేస్తున్నాడన్నారు. అనవసర విమర్శలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనిముద్రగడ పద్మనాభానికి జోగయ్య సూచించారు. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకే ముద్రగడ పద్మనాభం రెండో లేఖ రాశారని జోగయ్య విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేందుకు పార్టీ పెట్టి ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జోగయ్య తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతుందన్నారు.ఆ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్నాడన్నారు. వంగవీటి మోహన రంగా హత్య అనంతరం రాష్ట్రంలో అనేకమంది కాపులపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఆ కేసులు ఎత్తి వేయాలని 18 రోజులు పాటు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని తానను జోగయ్య గుర్తుచేశారు. కాపుల కోసం ముద్రగడ ఏం చేశారో చెప్పాలని జోగయ్య డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications