చంద్రబాబుతో చెంగల్రాయుడు భేటీ: ఏం లాభం లేదంటున్న నేతలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చెంగల్రాయుడు సోమవారం భేటీ అయ్యారు.
విజయవాడ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావించినప్పటికీ.. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చెంగల్రాయుడు టీడీపీలో చేరడం తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.
కాంగ్రెస్కు షాక్: పచ్చ కండువా కప్పుకునేందుకు మరో ఎమ్మెల్సీ సిద్ధం
కాగా, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చెంగల్రాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీలో చేరికపై చర్చంచినట్లు తెలిసింది. నియోజకవర్గంలో పరిస్థితి, పార్టీలో చేరిక తేదీ, తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, చెంగల్రాయుడు తమ పార్టీలో చేరడం వలన ఎలాంటి ఉపయోగం లేదని రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్ పేర్కొనడం గమనార్హం. అంతేగాక, రూ.70కోట్ల కాంట్రాక్ట్ కోసమే చెంగల్రాయుడు టీడీపీలో చేరతానంటున్నారని ఆయన ఆరోపించారు.