తెలుగు శాఖ ఎత్తివేత: రంగంలోకి రోశయ్య, చెన్నై క్వీన్ మేరిస్ కాలేజ్ ప్రిన్సిపాల్ చర్యలు
అమరావతి: చెన్నైలో తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అక్కడి విద్యార్ధులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా 'స్మార్ట్ క్లాస్ రూం' పేరుతో చెన్నైలోని ఓ కాలేజీలో ఉన్న బీఏ తెలుగు శాఖను మూసివేసేందుకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రయత్నించారు.
చివరకు ఆ విషయం ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన మందలించడంతో కాలేజీ ప్రిన్సిపాల్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ సంఘటన చెన్నైలోని క్వీన్ మేరీస్ కళాశాలలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చెన్నైలోని తెలుగువారి కోసం పలు కాలేజీల్లో తెలుగు డిపార్ట్మెంట్ విభాగాలు ఉన్నాయి. అలాంటి కాలేజీల్లో క్వీన్మేరీస్ కాలేజీ ఒకటి. 1952 నుంచి ఈ కాలేజీలో బీఏ తెలుగు విభాగం ఉంది. ఇక్కడ దాదాపు వంద మంది విద్యార్థులు తెలుగు భాషను చదువుతున్నారు.
తాజాగా కాలేజీ కొత్త భవనంలో ఈ విభాగానికి కేవలం ఒకే ఒక గది కేటాయించారు. అందులోనే తరగతి గదులతో పాటు, గ్రంథాలయాన్ని కూడా నిర్వహించుకుంటుంది అక్కడి తెలుగు విభాగం. అయితే తెలుగు విభాగాన్ని కాలేజీ నుంచి పూర్తిగా తీసేసి, రద్దు చేయాలనే ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా గత నెల రోజులుగా ఈ తరగతి గదిని ఖాళీ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ తెలుగు విభాగం అధ్యాపకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. తరగతి గదిని 'స్మార్ట్ తరగతి'గా ఆధునికీకరించాలని నిర్ణయించామని, గదిని ఖాళీ చేసి వేరే ప్రాంతంలో తెలుగు విభాగం నిర్వహించుకోవాలని ఆదేశించారు.
అయితే ఎక్కడ తెలుగు విభాగాన్ని కాలేజీలో ఎక్కడ నిర్వహించాలో చెప్పలేదు కాలేజీ ప్రిన్సిపాల్. దాంతో విద్యార్ధులకు అసలు విషయం తెలిసింది. స్మార్ట్ క్లాస్ రూం పేరిట ఏకంగా కళాశాల నుంచి తెలుగుశాఖనే తీసేయాలనే ఆలోచనతో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 'ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతి గది, అందులో ఉన్న గ్రంథాలయాన్ని ఖాళీ చేయాల్సిందే' అని ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి తెలుగు విభాగానికి ఆదేశాలు అందాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతిని ఖాళీ చేయమంటూ వేడుకున్నారు.
అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఈ విషయాన్ని తెలుగు సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ద్వారా గవర్నర్ రోశయ్యకు విన్నవించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రోశయ్య తన కార్యదర్శుల ద్వారా కాలేజీ ప్రిన్సిపాల్ను మందలించారు. దీంతో తెలుగు విద్యార్ధుల, అధ్యాపకుల సమస్య సద్దుమణిగింది.