రోడ్డు ప్రమాదం: చెన్నైలో ఏపీ టెక్కీ మృతి
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో సొంతూరు తణుకు, ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకుసంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. శశి విద్యాసంస్థల తణుకు క్యాంపస్ ఇంఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్రప్రసాద్ రెండవ కుమారుడు నిమ్మగడ్డ రాఘవేంద్ర (26) తమిళనాడులోని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు.
కాగా, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగ విధుల నిమిత్తం మంగళవారం ఉదయం బయలుదేరిన రాఘవేంద్ర.. మార్గ మధ్యలో బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. అతని మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
రాఘవేంద్ర మృతదేహాన్ని చెన్నై నుంచి తీసుకువచ్చి, బుధవారం సూర్యారావుపాలెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, రాఘవేంద్ర సోదరుడు నిమ్మగడ్డ అమరేష్ అమెరికాలో ఉంటున్నారు.
రాఘవేంద్ర మృతి పట్ల శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ దంపతులను పరామర్శించి ఓదార్చారు.