కుప్పం ప్రజలకు, చంద్రబాబుకు అదిరిపోయే శుభవార్త
చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. సెప్టెంబర్ 5 నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కుప్పం రైల్వే స్టేషన్లో ఆగనుంది. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - షిర్డీ సాయినగర్ మధ్య నడిచే ఈ రైలుకు సెప్టెంబరు 5వ తేదీ నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు కుప్పంలో ఒక నిమిషం ఆపనున్నారు. చెన్నై నుంచి షిరిడీ వెళ్లే రైలు (22601) మధ్యాహ్నం 2.14 గంటలకు కుప్పం వచ్చి 2.15 గంటలకు బయలుదేరి వెళుతుంది. అలాగే షిరిడీ నుంచి చెన్నై వెళ్లే రైలు (22602) కుప్పంకు తెల్లవారుజామున 4.44 గంటలకు వచ్చి 4.45 గంటలకు బయలుదేరి వెళుతుంది.
షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ రైలు కోసం గతంలోనే వినతులిచ్చారు. కొన్ని ముఖ్యమైన రైళ్లను ప్రధానమైన పట్టణాల్లో ఆపాలని రైల్వే తీసుకున్న నిర్ణయంలో భాగంగా షిరిడీ రైలును కుప్పంలో ఆపనున్నారు. ఆయా రైళ్లు ఏపీలోని కుప్పం, పీలేరు, సూళ్లూరుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, దువ్వాడ, బొబ్బిలి స్టేషన్లలో ఆగుతాయి.

బొబ్బిలిలో యశ్వంత్పూర్-హతియా ఎక్స్ప్రెస్ (12835), యశ్వంత్పూర్-టాటా నగర్ (12889), హతియా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (22837-22838) రైళ్లకు హాల్ట్లు ఇచ్చారు. దువ్వాడ స్టేషన్లో విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ (12803, 12804), నడికుడిలో భువనేశ్వర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17015), నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ (17232), సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్ప్రెస్ (12733), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ -హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (12603) రైళ్లకు హాల్ట్ కల్పించారు.












Click it and Unblock the Notifications