చెత్త రోడ్లు చెత్త ముఖ్యమంత్రి: రచ్చ మొదలుపెట్టిన టీడీపీ; జగన్ ఆటోలో రావాలన్న అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానం పరిస్థితికి చేరుకున్నాయని, రోడ్ల మరమ్మత్తు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి విధించిన డెడ్ లైన్ నేటితో ముగియడంతో తెలుగుదేశం పార్టీ చెత్త రోడ్లు చెత్త ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియా వేదికగా డిజిటల్ వార్ కు దిగింది. ఇక ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి పై జగన్ పై దుమ్మెత్తిపోసిన టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత వాహనమిత్ర కు డబ్బులు ఇచ్చే ముందు జగన్ రెడ్డి ఓ ఆటోలో రోడ్లపైకి వస్తే డ్రైవర్ల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
విమానమెక్కి వాహన మిత్ర అనటం కాదు .. ఆటోలో రోడ్డుపైకి రావాలన్న అనిత
విమానమెక్కి వాహనమిత్ర అనడం కాదని రోడ్లపై వాహనదారులు పడుతున్న అవస్థలు చూడాలని తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్మోహన్రెడ్డికి హితవు పలికారు. ఏపీలో రోడ్డు మార్గంలో ప్రయాణించే నడుం విరుగుతుంది అని లేదా రోడ్ల దుస్థితి అని చూస్తున్న ప్రజలు నడుం విరగొడతారనే భయంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారు అంటూ వంగలపూడి అనిత టార్గెట్ చేశారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇళ్లముందు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తున్నారని వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చూపించాలని అనిత సవాల్
అంతేకాదు రాష్ట్రంలో కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో గతుకులు లేని రహదారి ఎక్కడైనా ఉంటే చూపించాలని వంగలపూడి అనిత సవాల్ విసిరారు. గుంతలు పడిన రోడ్లతో, ప్రజల ప్రయాణం నరకప్రాయంగా మారుతున్న జగన్మోహన్రెడ్డికి పట్టడం లేదని ఆయన విమర్శించారు. జనాలను పీడించుట లో మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ని మించిన వారు లేరని వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు.
వాహనమిత్ర కాదు ఇవ్వాల్సింది వాహన పరిహార మిత్ర: టార్గెట్ చేసిన టీడీపీ
ఇక సోషల్ మీడియా వేదికగానూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది వాహనమిత్ర కాదూ వాహన పరిహార మిత్ర అంటూ పేర్కొన్న తెలుగుదేశం పార్టీ వాహన మిత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బులతో ఆటో వాళ్లకు జరుగుతున్నమేలు ఏమీ లేదని మండిపడ్డారు. రోజుకు జగన్ ఇచ్చే 27 రూపాయలతో ఏమొస్తుందో కానీ చెత్త రోడ్లపై వెళుతుంటే ఆటో వాళ్ళకి తడిసి మోపెడవుతుంది అంటూ, అద్వానంగా ఉన్న రోడ్లపై ఆటోలు పాడైపోతున్నాయి అని ఏలేశ్వరం నుండి జె అన్నవరం వరకు ఉన్న రోడ్డు పరిస్థితి ఇలా ఉందంటూ ఆ పోస్ట్ పెట్టి మరీ టిడిపి టార్గెట్ చేసింది.
రోజా పాత వీడియోతో.. జగన్ కు బుద్ధి రావాలంటూ పోస్ట్
ఇక గతంలో రోజా గుంతలమయమై వర్షాలకు వరదలతో నిండిన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలియజేసిన వీడియోను పోస్ట్ చేసి రోజా నిరసనతో అయినా జగన్ రెడ్డికి బుద్ధి వస్తుందేమో అంటూ పోస్ట్ చేసింది. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుంది టీడీపీ.
వాహన మిత్ర ఇచ్చేది అందుకే .. టీడీపీ కార్యకర్తల సెటైర్లు
జగనన్నా ఇవాళ 15వ తేదీ.. మీరిచ్చిన శాసనం గుర్తుందా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నా కనీసం రాష్ట్రంలో రోడ్లను కూడా బాగు చేయలేకపోతున్నారు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇక వాహన మిత్ర ఇచ్చేది గుంతలు పడిన రోడ్ల మీద ఆటోలు పాడవుతుంటే రిపేర్ లు చేయించుకోవటం కోసమే అని సెటైర్లు వేస్తున్నారు. ఇక వైఎస్సార్ కాలనీలలోనే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని నిప్పులు చెరుగుతున్నారు. రోడ్ల దుస్థితిపై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.