పుట్టిన తేదీలోనే 420: బాబును ఏకేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
తణుకు/ బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుజయ కృష్ణరంగారావు వేర్వేరుగా దుమ్మెత్తిపోశారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడిపై 420 కేసు పెట్టాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పుట్టిన తేదీ ఏప్రిల్ 20 అని, చంద్రబాబు పుట్టిన తేదీలోనే 420 ఉందని ఆయన వ్యాఖ్యానించారు.తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తణుకులో చేపట్టనున్న రైతు దీక్షతో చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రణాళికను అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే దీక్షతోనైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైతు దీక్షలో పాల్గొనడానికి ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యుడు సుజయ కృష్ణరంగారావు అన్నారు సంపూర్ణంగా రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడం లేదని ఆయన అన్నారు. దీంతో రైతులకు కొత్త రుణాలు అందకపోగా డ్వాక్రా మహిళలపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్బడి ఎనిమిది నెలలైనా రుణమాఫీ చేయకపోవడం పల్లనే డ్వాక్రా మహిళలకు అండగా జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు.