100కోట్లకు పైగా అక్రమాస్తులు: ఈ అధికారి చేతివాటం చూసి ఏసీబీ కళ్లు చెదిరాయి!
మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఆర్జించిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్
హైదరాబాద్/అమరావతి: మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఆర్జించిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపిఇడబ్ల్యూఐడిసి) చీఫ్ ఇంజనీరు భూమిరెడ్డి జగదీశ్వర్రెడ్డి ఇళ్ళపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 16కోట్ల రూపాయల అక్రమాస్తులు కనుగొన్నారు. వీటి విలువ మార్కెట్ అంచనా ప్రకారం వందల కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. జగదీశ్వర్రెడ్డితోపాటు భార్య, పిల్లలు, సన్నిహితుల పేర్లతో ఉన్న ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న స్థిర, చరాస్తులు గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆయన ఆక్రమాస్తులు చూసిన ఏసీబీ అధికారులకే కళ్లు చెదిరిపోతున్నాయి.
వందకోట్లకు పైమాటే..
వివరాల్లోకి వెళితే.. ఏపీఈడబ్ల్యూఐడీసీచీఫ్ ఇంజినీర్ భూమిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 9 ప్రాంతాల్లోని జగదీశ్వర్ రెడ్డి, ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. 1980లో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో జూనియర్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరిన జగదీశ్వర్రెడ్డి 37 ఏళ్ల సర్వీసులో నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఏకకాలంలో సోదాలు..
ప్రస్తుతం ఏపీఈడబ్ల్యూఐడీసీలో చీఫ్ ఇంజినీర్గా డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్, వనపర్తి జిల్లా అజ్జకొల్లు, అమ్మపల్లి, విజయవాడలోని ఏపీఈడబ్ల్యూఐడీసీ కార్యాలయం, చెన్నై, నల్గొండ, సూర్యాపేటల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి.
కుటుంబసభ్యుల పేర్లపై కోట్ల ఆస్తులు
అందులో భాగంగా.. జగదీశ్వర్రెడ్డి భార్య, ముగ్గురు కుమార్తెల పేరిట ఖరీదైన ఇళ్లు. వందల ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. జగదీశ్వర్రెడ్డి వడ్డీ వ్యాపారం కూడా పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడయింది. అక్రమాస్తులు పుస్తక విలువ ప్రకారం రూ.5.50 కోట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
కుటుంసభ్యుల ఇళ్లల్లోనూ సోదాలు
సూర్యాపేటలోని జగదీశ్వర్రెడ్డి సోదరుడు వెంకటేశ్వర్రెడ్డి నివాసంలోనూ ఏసీబీ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా కొంత నగదు, కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో ఉంటున్న జగదీశ్వర్రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్రెడ్డి ఇంట్లో, పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి గ్రామంలోనూ తనిఖీలు జరిగాయి.
కుమార్తెల పేరిట భారీగా ఆస్తులు
జగదీశ్వర్రెడ్డి, ఆయన కుమార్తెల పేరిట హైదరాబాద్లోని ఆంధ్రాబ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, విజయబ్యాంకుల్లోని 4 లాకర్లను మంగళవారం తెరవనున్నారు. పెద్ద కుమార్తె ఇంట్లో మరిన్ని అక్రమాస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
భార్య హైమావతి పేరిట అక్రమాస్తులు
హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారాకాపురి కాలనీలో రూ.20 లక్షల విలువైన 2,120 చదరపు అడుగుల ఫ్లాటు, తెలంగాణలోని వనపర్తిలో రూ.10 లక్షల విలువైన 2అంతస్తుల భారీ వాణిజ్య సముదాయం (4 వేల చదరపు అడుగుల విస్తీర్ణం), వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో 5 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన రూ.30 లక్షల విలువైన జీప్లస్ ఒక ఇల్లు, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో రూ.10 లక్షల విలువైన రెండంతస్తుల ఇల్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
భారీగా అక్రమాస్తులు
పెద్దకుమార్తె ఇందిరా ప్రియదర్శిని అలియాస్ విజయ పేరిట అక్రమాస్తులు వివరాలు.. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట్లో రూ.కోటి విలువైన జీ ప్లస్ 2 ఇల్లు. 3,700 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో నిర్మించారు, వనపర్తి జిల్లా అజ్జకొల్లులో రూ.78 లక్షల విలువైన 20.29 ఎకరాల వ్యవసాయ భూమి, ఇదే గ్రామంలో మనవడు ఆదిరెడ్డి పేరిట రూ.12 లక్షలు విలువైన 8 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్నగర్ జిల్లా మద్దిగట్ల గ్రామంలో రూ.1.53 లక్షల విలువైన 2.20 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఎక్కడ పని చేస్తే.. అక్కడ అక్రమాస్తులు..
ఇక రెండో కుమార్తె స్నిగ్ధ పేరిట ఉన్న ఆస్తుల వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని జ్యోతిహిల్రిడ్జ్లో రూ.87.50 లక్షల విలువైన 3,164 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటు, వనపర్తి జిల్లా అజ్జకొల్లులో రూ.34.50 లక్షల విలువైన 10 ఎకరాల వ్యవసాయ భూమి, మూడో కుమార్తె రవళి పేరిట.. వనపర్తి జిల్లా అజ్జకొల్లులో రూ.12.23 లక్షల విలువైన 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అవినీతి తిమింగలమే..
550 గ్రాముల బంగారం, 13కిలోల వెండి, రూ.83 వేల నగదు, పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.12 లక్షలు ఉన్నాయి. జగదీశ్వర్రెడ్డి పెద్దఎత్తున వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో దొరికిన ప్రామిసరి నోట్లు, డెయిరీల్లో రాసుకున్న వివరాలను బట్టి సుమారు రూ.50 లక్షల విలువైన అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోందని వెల్లడించారు. జగదీశ్వర్రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఏసీబీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ తెలిపారు.