టిడిపితో పొత్తుకు కొర్రీ: సిఎం పదవికి బిజెపి పట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీలు పట్టుబడుతుండడంతో తెలుగుదేశం, బిజెపి మధ్య తెలంగాణలో పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవికి తమకు ఇవ్వాలని పట్టుబడుతూ తెలంగాణలో 65 నుంచి 70 స్థానాలు తమకు కేటాయించాలని బిజెపి పట్టుబడుతోంది. నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్తో పొత్తు వంటి విషయాలు తమకు సానుకూలంగా ఉన్నాయని బిజెపి భావిస్తోంది. దానికి తోడు, తెలంగాణలో బిజెపికి సానుకూల పవనాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఉందని బిజెపి వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో టిడిపితో పొత్తు వద్దని బిజెపి తెలంగాణ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. పొత్తు తప్పనిసరైతే తమ డిమాండ్లకు అంగీకరించాలని పట్టుపడుతున్నారు. ఈ స్థితిలో బిజెపి ఆంద్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ తెలంగాణ నేతలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం అందరినీ కూర్చోబెట్టి పొత్తు వద్దంటున్నవారికి హితబోధ చేశారు. నరేంద్ర మోడీని ప్రధాని చేయాలంటే పొత్తులు తప్పవంటూ ఆయన చెప్పారు.
జవదేకర్ పార్టీ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో ముఖాముఖీ సమావేశాన్ని నిర్వహించారు. ఒక్కొక్కరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో కొంత మంది పొత్తు వద్దంటే వద్దని వాదించినట్లు సమాచారం. మరికొంత మంది పొత్తు ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా దాదాపు 60 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. తెలంగాణ, సీమాంధ్రల్లో తెలుగుదేశం, లోక్సత్తా, జన సేన వంటి పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించినట్లు తెలిసింది.
పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే 272 ఎంపీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే మోదీని ప్రధాని చేయాలనే లక్ష్యం నెరవేరదని తేల్చిచెప్పారు. ఈ దృష్ట్యా పొత్తుపై పునరాలోచన చేయాలని హితవు పలికారు. 60 నుంచి 70 శాసనసభా స్థానాలతో పాటు తెలంగాణలో 11 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని కూడా బిజెపి తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేయనుంది. ఈ స్థితిలో బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఏ మేరకు సాధ్యమవుతుందనేది సందేహాస్పదంగానే ఉంది. అయితే, తెలంగాణలో పొత్తు బిజెపికి ఎంత అవసరమో, టిడిపికి కూడా అంతే అవసరం.