ఏది స్వార్థం.. ఎవరిదీ నిజాయితీ.. ముద్రగడ పాదయాత్రపై హోంమంత్రి చినరాజప్ప ఎదురుదాడి
ఎవరిది స్వార్థం.. ఎవరికి అధికారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నిరంతరం చర్చ జరుగుతోంది.. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ సామాజిక వర్గానిదీ గణనీయ ప్రభావం చూపే సామర్థ్యం.
అమరావతి: ఎవరిది స్వార్థం.. ఎవరికి అధికారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నిరంతరం చర్చ జరుగుతోంది.. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ సామాజిక వర్గానిదీ గణనీయ ప్రభావం చూపే సామర్థ్యం. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలిచ్చింది ఎవరు? అసలు రిజర్వేషన్లు కల్పించాలని కాపులు అడిగారా? అడగక ముందే ముందే కూసిన కోయిల మాదిరిగా..
2014 ఎన్నికల్లో 'నౌ ఆర్ నెవర్' అన్న పరిస్థితుల్లో ప్రతి సామాజిక వర్గానికి ఒక హామీ గుమ్మరించారు ప్రస్తుత సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. గెలుపొందిన తర్వాత ఏడాదిన్నర పాటు కాలక్షేపంచేశారు.
ఇచ్చిన హామీ అమలు చేయాలని సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుని కేంద్రంగా నిర్వహించిన బహిరంగ సభ హింసాత్మకంగా మారింది. రత్నాంచల్ ఎక్స్ప్రెస్ బోగీలు ఆందోళనకారులు తగులబెట్టారు. దాని సాకుగా ఆందోళనకారులపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసింది. కానీ ముద్రగడ పద్మనాభం గానీ, కాపులు గానీ వెనుకడుగు వేయలేదు.
26 నుంచి ముద్రగడ చలో అమరావతి
గతంలోనే పాదయాత్ర నిర్వహించడానికి గతంలో అనుమతి నిరాకరించడంతో ఇంటిలోనే కుటుంబ సమేతంగా నిరవధిక నిరాహార దీక్ష అమలు జేశారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో ముద్రగడ ఇంటిని చుట్టుముట్టి ఆయన కుటుంబ సభ్యులను చెప్పడానికి వీల్లేని విధంగా దుర్భాషలాడి హాస్పిటల్కు తరలించిన నేపథ్యం పోలీసు యంత్రాంగానిది. ఈ సంగతి తాము జీవితకాల: అంతా గుర్తు ఉంచుకుంటామని ముద్రగడ హెచ్చరించారు. తాజాగా ఈ నెల 26వ తేదీన ‘చలో అమరావతి' పేరిట మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ముద్రగడ సన్నద్ధమయ్యారు.
Recommended Video
శాంతియుత పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వరా?
కానీ ‘తుని విధ్వంసం లాంటి మరో ఘటన జరక్కూడదన్న ఉద్దేశంతోనే అనుమతి లేకుండా ముద్రగడ పద్మనాభం నిర్వహించతలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది వారి విధి నిర్వహణలో భాగం.' అని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. నిజంగా కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ఉంటే శనివారం హోంమంత్రి చిన రాజప్ప కాపు నాయకుల, ప్రజాప్రతినిధుల అత్యవసరంగా సమావేశం కావాల్సిన అవసరమేమిటని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అంతటితో ఆగక ముద్రగడ పద్మనాభం స్వప్రయోజనాల కోసమే ఆందోళన చేపడుతున్నారని ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు అన్నారు. కాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛా ప్రకటనకు అవకాశం ఉన్నది. కానీ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిర్వహించే పాదయాత్రకు అనుమతి నిరాకరించడం అంటే నియంత్రుత్వం తప్ప మరొకటి కాదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
కాపులకు రిజర్వేషన్లపై బీసీల ప్రతిఘటన
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తెలంగాణలోని కేసీఆర్ సర్కార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజా వ్యతిరేకతను, నిరసన గళాన్ని వినేందుకు సిద్ధంగా లేవు. సమస్యలు ఎదురైన ప్రతిచోటా పోలీసు నిర్బంధం విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఆందోళనకు శ్రీకారం చుట్టిన ఏడాదిన్నర కాలానికి 2016 ప్రారంభంలో కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు ‘మంజునాథ కమిషన్'ను ఏర్పాటు చేసింది. కానీ అది ఏర్పాటై అప్పుడే ఏడాదిన్నరవుతున్నది. కానీ సిఫారసులు మాత్రం రాలేదు. మరోవైపు బీసీల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకమని బీసీ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి.
హామీలు అమలుచేస్తే ఆందోళన అవసరమేమిటో మరి?
మరోవైపు ఆందోళనకు శ్రీకారం చుట్టిన ప్రతిసారి కాపు ప్రజాప్రతినిధులను, ప్రముఖులను వ్యూహాత్మకంగా రెచ్చగొట్టడం ఆనవాయితీగా వస్తున్నది. హోంమంత్రి - డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప సారథ్యంలో జరిగిన సమావేశం సీఎం చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసేశారని సెలవిచ్చేసింది. హామీలు అమలు చేస్తే ముద్రగడ ఆందోళన బాట పట్టాల్సిన అవసరమేమిటో చిన రాజప్ప చెప్పాలని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మందక్రుష్ణ మాదిగకు ఏపీ సీఎం చంద్రబాబు ముందు నుంచి సహకరించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతపై మంత్రుల ప్రత్యారోపణలు ఇలా
వాస్తవం ఇదైతే.. మందక్రుష్ణను.. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరిన ముద్రగడ పద్మనాభాన్ని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారని చంద్రబాబు క్యాబినెట్ సహచరుడు కొల్లు రవీంద్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరులో ఎదురుదాడికి దిగారు. కులాలు, వర్గాలు, ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నారన్నారు. పనిచేసే నాయకుడు కావాలా? అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకుడు కావాలా? అని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.