అమరావతికి తరలిన తొలి కార్యాలయం: '27 నుంచి అన్ని శాఖలు అక్కడే'
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఈ నెల 27లోగా అన్ని శాఖల కార్యాలయాలూ తరలిరావాల్సిందేనని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గురువారం పెనమలూరులో అద్దెకు తీసుకున్న భవనంలో మత్స్యశాఖ కార్యాలయాన్నిమంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావులు ప్రారంభించారు.
దీంతో అమరావతికి తరలి వచ్చిన తొలి విభాగంగా రాష్ట్ర మత్స్యశాఖ నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి విజయవాడ, గుంటూరు, వెలగపూడి నుంచి అన్ని ఆఫీసులు పనిచేస్తాయని తెలిపారు. అన్ని శాఖల అధిపతులు, ప్రధాన అధికారులు మరో పది రోజుల్లో రాజధాని అమరావతికి వచ్చేస్తారన్నారు.
ఆ తర్వాత ఉద్యోగులు కూడా వస్తారని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర హోంశాఖ ఆఫీసు త్వరలోనే విజయవాడకు వస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా 60 మంది ఉద్యోగులతో మత్స్యశాఖ ఈ ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 25న గుంటూరులో వ్వవసాయశాఖ ఆఫీసుని ప్రారంభిస్తామని తెలిపారు. 20న ఏరువాక పౌర్ణమిని వైభవంగా జరుపుతామని, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతారని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు.
కాగా పాడేరు ఏఎస్పీ శశికుమార్ మృతిపట్ల డిప్యూటీ సీఎం చినరాజప్ప దిగ్బ్రాంతి చెందారు. శశికుమార్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం ఉదయం ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశికుమార్(30) మృతి చెందిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ వార్త తెలియగానే చినరాజప్ప తన అధికారకార్యమాలను రద్దు చేసుకుని వెంటనే విశాఖకు చేరుకున్నారు. విశాఖ కెజిహెచ్లో ఉన్న శశికుమార్ మృతదేహానికి చినరాజప్ప నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన మృతి పోలీసు యంత్రాంగానికి తీరని లోటని అన్నారు.












Click it and Unblock the Notifications