'రామ్మాధవ్ను బుగ్గన కలిశారు, పవన్ కళ్యాణ్ ఏపీకి అన్యాయం చేస్తున్నారు'
విజయవాడ: ఏపీ అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బురద జల్లుతున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మండిపడ్డారు.
నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పదిహేను కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
వైసీపీ ఎంపీల రాజీనామా అంతా నాటకం అన్నారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేత రామ్ మాధవ్ను కలవడమే నిదర్శనమన్నారు.
బీజేపీ డైరెక్షన్లోనే జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారన్నారు. బీజేపీతో కలిసి జగన్, పవన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎదుగుదలను ఓర్వలేక బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని, చంద్రబాబు ప్రజాదరణను ఆపలేరన్నారు. ఈ నెల 28న రాజమహేంద్రవరంలో ధర్మపోరాట దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.