ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్నజీయర్ స్వామి హాట్ కామెంట్స్; ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్టేనా!!
ఏఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గుంతల మయం అయిన రోడ్లపై వినూత్నమైన నిరసన తెలియజేసి, రోడ్లను తక్షణం మరమ్మతు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయినప్పటికీ నేటికీ ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏపీలో రోడ్ల దుస్థితిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడానికి వెళ్ళిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. రాజమండ్రిలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే సమయంలో, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి ప్రయాణం చేయడానికి తనకు 3 గంటల సమయం పట్టిందని వ్యాఖ్యానించిన చిన్న జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రయాణంలో ఇంతగా ఇబ్బంది ఎదుర్కోవడానికి బహుశా రోడ్లమీద గోతులు ఎక్కువగా ఉండవచ్చు అంటూ చలోక్తులు విసిరారు.
ఇక చిన్న జీయర్ స్వామి చేసిన హాట్ కామెంట్స్ తో ఇప్పటికే ఏపీలో రోడ్ల దుస్థితి పై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలకు మరో ఆయుధం దొరికినట్లయింది. చిన్నజీయర్ స్వామి కూడా ఏపీ ప్రభుత్వ అసమర్థతని తెలియజేశారు అన్న చర్చ సాగుతుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, అనేక రకాల పన్నులతో, టోల్ వసూళ్ల తో ప్రజలను బాదుతున్న జగన్ సర్కార్ రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టీడీపీ నేతలు రోడ్ల మీద గుంతల్లో వలలతో చేపలు పట్టి, గుంతలకు పూలాభిషేకం చేసి మరీ తమ నిరసన వ్యక్తం చేశారు.
ఇక జనసేన కూడా రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. పెద్ద ఎత్తున పోరాటాలకు తెరతీసింది. ఇక తాజాగా గడపగడపకు ప్రభుత్వం పేరుతో వెళుతున్న వైసిపి ప్రజాప్రతినిధులకు రోడ్ల సమస్యపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి రోడ్ల దుస్థితిపై చినజీయర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఏవిధంగా వాడుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.