నేను కన్నెర్రజేస్తే పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టేవాడా, అందుకే ఊరుకున్నా: చింతమనేని
ఏలూరు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. తాను కళ్లు ఎర్రజేస్తే జనసేనాని దెందులూరులో సమావేశం పెట్టేవాడా అని ప్రశ్నించారు.
'లోకసభ' సీన్ రివర్స్, చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నందునే
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నందున సంయమనంతో ఉన్నానని చెప్పారు. దెందులూరు నుంచి పోటీ చేయమని తాను పవన్ కళ్యాణ్కు చెబితే, ఆయన మాత్రం మరెవరినో పోటీలో పెడతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, జగన్లతో బీజేపీ తోలుబొమ్మలాట ఆడిస్తోందని ఆరోపించారు.
అందులోనే రౌడీయిజం
తన రౌడీయిజం పేదవాడి సమస్యల పరిష్కారంలో ఉంటుందని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టి, కులపిచ్చి తీసుకురావాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, వైయస్ జగన్లు బీజేపీ వలలో పడ్డారని అభిప్రాయపడ్డారు.
ధర్మపోరాటం చేస్తున్న చంద్రబాబుపై కుట్ర
ఏపీ అభివృద్ధి కోసం ధర్మపోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహాకుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేరుగా ఆరోపించారు. చంద్రబాబును ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం కోసం కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ మహా కుట్రకు కన్వీనర్ మోడీ
ఈ మహాకుట్రకు కన్వీనర్గా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, సభ్యులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఉన్నారని చెప్పారు. ఏపీని అధోగతి పట్టించడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఏపీలో ఐటీ దాడులు జరిగాయన్నారు.