అవును కోడిపందాల్లో పాల్గొన్నా-మాటమార్చిన చింతమనేని-ఇంట్లోనే ఉన్నా- కేసులు పెట్టుకోమంటూ..
ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలంగాణలో కోడి పందాల వ్యవహారంపై మాట మార్చారు. తొలుత కోడిపందాల్లో దొరికిపోయి, ఆ తర్వాత అసలు తాను పాల్గొనలేదని, రాక్షస రాజకీయాలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగిన చింతమనేని.. తెలంగాణ పోలీసులు విడుదల చేసిన వీడియోలో దొరికిపోయారు. దీంతో ఆయన ఇవాళ అసలు విషయం చెప్పేశారు.
పటాన్ చెరులో కోడిపందాలకు వెళ్లింది నిజమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ అంగీకరించారు.
కోడిపందాలు తన వీక్ నెస్ అని, అందుకే వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయానని కూడా చింతమనేని వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కోడిపందాలు ఆడటం నేరమైతే పోలీసులు కేసులు పెట్టుకోవచ్చని కూడా చింతమనేని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

హైదరాబాద్ శివార్లలో రెండు రోజుల క్రితం కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు ఉన్నారు. పటాన్చెరులో లక్షల్లో బెట్టింగ్ పెట్టి కొందరు కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో బండారం బయటపడింది. ఈ దాడిలో పోలీసులు 20 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి చింతమనేని పరారయ్యాడని సమాచారం. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేని తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా ప్రకటనతో చింతమనేనిని ఏపీకి వచ్చి పోలీసులు అరెస్టు చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications