ఒకరితో కాపురం చేస్తుంటే నేనూ చేస్తా అనడానికి సిగ్గుందా: జగన్-మోడీలపై చింతమనేని
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆయన టీ అమ్మి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు.
తమకు చాయ్ పే చర్చా వద్దని, హోదాయే ముద్దు అన్నారు. ఆంధ్ర టీ తాగండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలనే రహస్య ఒప్పందం ఈ రెండు పార్టీల మధ్య ఉందన్నారు.

ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రెండు పార్టీలు కలసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి చెబుతామన్నారు.
ఇంటింటికీ టీడీపీ మాదిరి ఇంటింటికీ మీ అపవిత్ర కలయిక, రహస్య ఒప్పందాలు, దుర్బుద్ధి రాజకీయాలను ప్రచారం చేస్తామన్నారు. ఒక పార్టీతో సంసారం చేస్తుంటే మేము కూడా వచ్చి కాపురం చేస్తామంటూ అడగడానికి సిగ్గుందా జగన్ అని తీవ్రంగా మండిపడ్డారు. ఒకరితో కాపురం చేస్తుంటే నేను కూడా వచ్చి కాపురం చేస్తానని అడగడం ఎంతవరకు సమంజసం అన్నారు. జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడతామన్నారు.












Click it and Unblock the Notifications