తగ్గని చిరు: రిజైన్పై సోనియాకి తేల్చిచెప్పిన పురంధేశ్వరి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చేస్తే రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం అన్నారు. లోకసభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో ఈ రోజు ఘటన దురదృష్టకరమన్నారు. హైదరాబాదును ఎట్టి పరిస్థితుల్లో యూటి చేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేశారు.
ఆ ప్రాజెక్టును బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. పరిస్థితులు వెల్లోకి వెళ్లేలా చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయాలని హితవు పలికారు. సిడబ్ల్యుసి నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని కానీ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారు.
కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి పురంధేశ్వరి రాజీనామా!
తెలంగాణ ముసాయిదా బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశ పెడితే కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజీనామా చేసే అవకాశాలున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆమె ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రేపు బిల్లు లోకసభకు వస్తే పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆమె ఇదే విషయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
బుధవారం లోకసభ వాయిదా పడిన అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ... తాను కేంద్రమంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, విధులకు కూడా హాజరు కావడం లేదని చెప్పారు. తెలంగాణ బిల్లును లోకసభలో పెడితే రాజీనామా చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. తమ నిరసనకు కేంద్రం నుండి ఆశించినంత స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే లోకసభలో నిరసన తెలిపామని పురంధేశ్వరి చెప్పారు.
సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేకపోతున్నారు: వెంకయ్య
కాంగ్రెసు పార్టీ సొంత పార్టీ నాయకులను అదుపు చేయలేకపోతోందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు.