‘చిరంజీవి పార్టీని వీడరు: శేషజీవితమంతా కాంగ్రెస్కే’
పశ్చిమగోదావరి: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పార్టీ మారతారని వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టత నిచ్చారు. గత కొన్ని రోజులుగా చిరంజీవి టిడిపిలో చేరతారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏలూరులో పర్యటించిన రఘువీరా రెడ్డి స్పందించారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారన్న వార్తల్లో నిజం లేదని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. చిరంజీవి శేష జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితమని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. టిడిపి చేపడుతున్న జనచైతన్య యాత్రలు జనాలు లేక వెలవెలబోతున్నాయని అన్నారు.
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతోందన్నారు. దుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతనే పార్క్ నిర్మాణం చేపట్టాలని రఘువీరా సూచించారు.