బాబుకు నిద్ర కరవువుతోంది: చిరు నిప్పులు, మోడీపై..
రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదివారం మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవి, బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, పళ్లం రాజు, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెసు పార్టీ పరిస్థితికి పార్టీలోని కొందరు నేతలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయలేక చంద్రబాబుకు నిద్ర కరువవుతోందన్నారు. రుణమాపీ చేయకుంటే గతంలో మాదిరిగా.. ఇప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణమవుతారన్నారు. తన పాలనలో మోడీ మతతత్వాన్ని జొప్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కూడా మోడీ హాజరు కాలేదన్నారు.
బొత్స మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. రుణమాఫీ పైన టీడీపీ నేతలు, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో సొంత సామాజిక వర్గానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూరేలా టీడీపీ తీరు ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రుణమాఫీ పైన సెప్టెంబర్ నెల 6వ తేదీ వరకు స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. లేదంటే సెప్టెంబర్ 8న బ్యాంకుల ముందు ఆందోళన చేస్తామన్నారు. రైతులు బంగారం పైన రుణాలు తీసుకున్న నేపథ్యంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేలానికి పోనిచ్చే ప్రసక్తి లేదన్నారు.