నన్ను అరెస్ట్ చేయిస్తావా! ఏం చూసి భయపడ్డావ్: బాబుపై చిరంజీవి
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తాము ఎందుకు అరెస్టు చేశారని, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి సోమవారం నాడు ప్రశ్నించారు.
ముద్రగడ దీక్ష విరమించక ముందు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డితో కలిసి చిరంజీవి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని విమానాశ్రయం నుంచి బయటకు రానియ్యలేదు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ముద్రగడ దీక్ష విరమణ అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, తమను ఎందుకు నిర్భంధించారని ప్రశ్నించారు. సామరస్యంగా వెళ్లి దీక్షకు సంఘీభావం తెలపాలనుకున్నామన్నారు.
అలాంటి తమను అరెస్టు చేయడం ఎంత వరకు సబబు అని గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన తప్పిదాలు కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మా నోళ్లు మూయించేందుకు ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు.
మేం రెచ్చగొట్టేవాళ్లం కాదని, పెట్రేగిపోయేవాళ్లం అసలే కాదని అలాంటప్పుడు చంద్రబాబు ఏం చూసి భయపడుతున్నారన్నారు. ప్రతిపక్షాల నోరు ఎందుకు మూయించాలనుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సమస్యల పైన పోరాటం చేయలేదా అని నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాటాలు చేశారని, ధర్నాలు చేశారని, అసెంబ్లీలో కూడా నిద్రించారని చెప్పారు. ఇప్పుడు మేం ముద్రగడ దీక్షకు సంఘీబావం తెలిపేందుకు వస్తే నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికార పక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారా అన్నారు.
ఇలా చేస్తే మీ చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోందన్నారు. చంద్రబాబు డివైడ్ అంట్ రూల్ పద్ధతిలో (విభజించి పాలించు) వెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబులో విషయం ఉందనుకున్నామని, కానీ ఆయన డైవర్షన్, డివైడెడ్ మనిషి అని తేలిందన్నారు.