బిజీగా ఉన్నారు, చిరంజీవి సైకిలెక్కక పోవచ్చునేమో: డిగ్గీ ధీమా
తిరుపతి: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరకపోవచ్చునని కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. చిరంజీవి డిసెంబర్ 5వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన బుధవారం స్పందించారు.
చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారని, బహుశా తెలుగుదేశం పార్టీలో చేరకపోవచ్చునని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చిరంజీవిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయగానే ఆయన కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ఆ రకంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సిపిఎం మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయని, చివరగా తమ పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు.
దేశీయ కంపెనీలు డ్రైనేజీ పనులకు తప్ప మిగతా వాటికి పనికి రావని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడం దారుణమని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని, ఆ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే దానికి కారణమని దిగ్విజయ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications