చిరు మాస్ ఇమేజ్: రెండు విధాలా కలిసొచ్చేట్లు
కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం వైపు, రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు వైపు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో సీమాంధ్రలో కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి చిరంజీవిని ప్రచార కమిటీ చైర్మన్గా నియమించడం ద్వారా ఇమేజ్ కూడా కలిసి వస్తుందనే అంచనా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాంతాలవారీగా కాంగ్రెసు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాన్ని రచించినట్లు అర్థమవుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న బిసిలతోపాటు, కాపు సామాజిక వర్గంపై కూడా ఆ పార్టీ నాయకత్వం కన్నేసింది. ఈ క్రమంలోనే కుల సమీకరణకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు మొదలెట్టిందని ఆ పార్టీ వర్గాలు సైతం ధృవీకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు ప్రధాన కులాలను తన వైపు తిప్పుకొనేందుకు సీమాంధ్ర ప్రాంత ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్గా చిరంజీవిని, సీమాంధ్ర ప్రాంత పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని ఆ పార్టీ నాయకత్వం ఎంపిక చేసిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి
తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ తమ పార్టీని గెట్టెక్కిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రలో మాత్రం మాస్ ఇమేజ్ఫై దృష్టిసారించింది. తెలుగు సీని పరిశ్రమలో అగ్రనటుడిగా గుర్తింపు పొంది విశేషమైన అభిమానుల సంపద ఉన్న చిరంజీవిని ఎన్నికల ప్రచార కమిటి ఛైర్మన్గా కాంగ్రెస్ నాయకత్వం నియమించడం వెనక మాస్ ఇమేజ్ వ్యూహం దాగివుందని చెప్పవచ్చు. అదే సమయంలో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు ఓట్లు చేజారకుండా చిరంజీవి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.