చంద్రబాబును కలిసిన చిరంజీవి
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు.
ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ. 50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి.. వరద సాయం కింద రూ. కోటి అందించడంపై ఏపీ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. కాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం కారు వరకూ వెళ్లి చిరంజీవికి వీడ్కోలు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా, ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్కు తమవంతుగా సాయం అందించిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుంటే, ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్లకు చెరో రూ.కోటి చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు.. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించి అందించారు.

కాగా, వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మందు సినీ, ఇతర రంగాల ప్రముఖులు భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలోనే సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు విరాళాలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. చిన్నా, పెద్ద ఇలా ప్రజలు అందరూ స్పందించారని, సంఘటితంగా ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారన్నారు.
బాధితులకు ఇప్పటి వరకూ రూ. 602 కోట్లు విడుదల చేశామని, ఇందులో రూ. 400 కోట్లు దాతలే ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. మొత్తం నష్టం 6 వేల 800 కోట్ల రూపాయల మేర జరిగిందని, కేంద్రం ఇచ్చే డిజాస్టర్ ఫండ్కు కూడా హద్దులు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, మానవత్వంతో వ్యవహరించాలని ఈ మొత్తం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. వర్షాల వల్ల మొత్తం 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. కాగా, కేంద్రం ఇటీవల వరద సాయం కింద ఏపీకి రూ. వెయ్యి కోట్ల మేర నిధులు అందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications