చిరు ఇంటి ముట్టడి: జైపికి సమైక్యసెగ, ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విశాలాంధ్ర మహాసభ నేతలు, కార్యకర్తలు శనివారం ఉదయం కేంద్ర మంత్రి చిరంజీవి ఇంటిని ముట్టడించారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో గల ఆయన ఇంటిని ముట్టడిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పదవి చిరంజీవి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
దాంతో పాటు విశాలాంధ్ర మహాసభ నేతలు, కార్యకర్తలు మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించారు రాజీనామాలు చేసిన తర్వాతనే మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాష్ట్రంలో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు విశాలాంధ్ర నేతలను అడ్డుకున్నారు. చిరంజీవి విశాలాంధ్ర మహాసభ నాయకులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. తన రాజీనామా వల్ల విభజన ఆగిపోతుంటే తప్పకుండా రాజీనామా చేస్తానని చిరంజీవి అన్నారు.
లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు కర్నూలులో సమైక్య సెగ తగిలింది. తెలుగు తేజం పేరుతో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలులోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజనపై పార్టీ విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు
సమైక్యవాదుల చర్యకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖంపై కోపంతో ముక్కు కోసుకుంటామా అని ఆయన అడిగారు. హైదరాబాద్ కన్నా రాయలసీమ భవిష్యత్తు విభజన వల్ల పెద్ద సమస్య అని ఆయన అన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసేలా చూడాలని ఆయన సూచించారు.