Chittoor dairy: చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు ముహూర్తం: పాడి రైతులకు అదనపు చెల్లింపులు..!
చిత్తూరు: దేశంలోనే రెండో అతి పెద్ద పాల కర్మాగారంగా పేరున్న చిత్తూరు విజయ డెయిరీని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల కొత్త సంవత్సరం కానుకగా.. సంక్రాంతి నాటికి డెయిరీని పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాడి రైతులకు బకాయిలను చెల్లించడంతో పాటు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు అవసరమైన నిధులు ఏ స్థాయి అవసరం అవుతాయనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

పునరుద్ధరణపై సమగ్ర నివేదిక..
చిత్తూరు విజయ డెయిరీని పునరుద్ధరించడానికి అవసరమైన ఓ సమగ్ర నివేదికను అందజేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పాడి పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో కలెక్టర్ త్వరలో భేటీ కానున్నారని అంటున్నారు. చిత్తూరు డెయిరీకి పాలను సరఫరా చేసిన పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, డెయిరీని పునరుద్ధరించడానికి అవసరమైన నిధులపై జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించనున్నట్లు సమాచారం.

అత్యాధునికంగా..
చిత్తూరు విజయ డెయిరీ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. పాలను నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, అన్ని రకాల పాల ఉత్పత్తులను కూడా ఇదే డెయిరీలో తయారు చేసేలా దీని స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. డెయిరీతో పాటు సహకార చక్కెర కర్మగారాన్ని సైతం పునరుద్ధరించడం ఖాయమని తెలుస్తోంది.

దేశంలోనే రెండో అతి పెద్ద డెయిరీగా..
గుజరాత్ లోని ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) తరువాత రెండో అతి పెద్ద పాల కర్మాగారంగా చిత్తూరు డెయిరీకి పేరుంది. 1965లో సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చిత్తూరు డెయిరీని నెలకొల్పారు అప్పటి పాలకులు. 2001లో ఈ సంస్థ మూత పడిపోయింది. 2008లో దీన్ని పాక్షికంగా పునరుద్ధరించారు. అనంతరం 2015లో మరోసారి కార్యకలాపాలు నిలిచిపోయాయి. క్రమంగా పూర్తిగా మూత పడిపోయింది.

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు
తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చిత్తూరు డెయిరీ, సహకార చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం.. జనవరి నాటికి డెయిరీని పునరుద్ధరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం సహకర విజయ డెయిరీ పునః ప్రారంభానికి గల అవకాశాలపై కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను కూడా అందజేసింది.

అదనపు చెల్లింపులు..
ఈ నివేదికను యధాతథంగా అమలు చేయడంతో పాటు అందులో పొందుపరిచిన దాని కంటే అదనపు నిధులను మంజూరు చేయనున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. చిత్తూరు డెయిరీకి పాలను సరఫరా చేసే రైతులకు అదనంగా చెల్లింపులు చెల్లిస్తే.. దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని కమిటీ ప్రతినిధులు నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం పాడి రైతులకు లీటర్ ఒక్కింటికి కనీసం నాలుగు రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించినట్లు చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications