పెద్దిరెడ్డి అనుచరుడి మీద పంజా విసిరిన పోలీసులు, వదలద్దు అని చెప్పిన చంద్రబాబు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ నాయకులు అనుకున్నట్లుగానే మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుల హస్తం ఉందనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాదవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదట మాదవరెడ్డి అరెస్టు అయ్యాడని ప్రచారం జరిగినా అది నిజం కాదని ఆలస్యంగా వెలుగు చూసింది.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె (ఉమ్మడి చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్దరాత్రి అగ్నిప్రమాదం జరగడంతో సీం చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్ అయ్యారో అందరికి తెలిసిందే. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా, అగ్నిమాపక శాఖ చీఫ్ తో పాటు ముఖ్య అధికారులు అందరూ మదనపల్లె వెళ్లి స్వయంగా విచారణ చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలతో అందరూ మదనపల్లె చేరుకుని విచారణ చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ తదితరులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలించి అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సుమారు 2,400 ఫైళ్లు కాలిపోయాయని, సుమారు 700 ఫైళ్లు పాక్షికంగా కాలిపోవడంతో వాటిని రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా చెప్పారు.
ఫోరెన్సిక్ నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత మరన్ని విషయాలు తెలుస్తాయని, తరువాత కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

జులై 10వ తేదీ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు పని చెయ్యకపోవడం, సీసీటీవీ కెమెరాలు పని చెయ్యడం లేదని టెక్నీషియన్లకు సమాచారం ఇవ్వకపోవడంతో పక్కాప్లాన్ ప్రకారం ఫైళ్లలకు నిప్పంటించి ఉంటారని అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇప్పటికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.
ఇదే సమయంలో అగ్నిప్రమాదం జరిగిన రోజుకు ముందు వరుసగా 10 రోజుల పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు మాదవరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. మాదవరెడ్డి చిక్కితే మొత్తం మ్యాటర్ బయటకు వస్తుందని, అతని కోసం గాలిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications