అనురాధ హత్య షాకింగ్: పక్కా ప్లాన్తో సొంత మేనల్లుడేనా? దాడి వెనుక..
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర పాలక మేయర్ కటారి అనురాధ హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. అనురాధ హత్యలో... ఆమె భర్త కటారి మోహన్కు దగ్గరి బంధువు అయిన చింటూ పేరు వినిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. అతను మోహన్కు మేనల్లుడు అని తెలుస్తోంది. బావమరిది అవుతాడని కూడా వార్తలు వస్తున్నాయి. దగ్గరి బంధువు పేరు వినిపించడం కలకలం రేపుతోంది.
అనురాధ హత్య, ఆమె భర్త మోహన్ పైన దాడి అనంతరం నిందితులు ముగ్గురు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు పోలీస్ స్టేషన్లో, ఒకరు కోర్టులో లొంగిపోయారని తెలుస్తోంది. పోలీసు స్టేషన్లో రెడ్డి, వెంకటేష్ అనే ఇద్దరు లొంగిపోయారు. కోర్టులో లొంగిపోయిన వ్యక్తి చౌడెపల్లికి చెందిన వాడని సమాచారం.
మరోవ్యక్తి లొంగిపోతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, స్టేషన్లో లొంగిపోయిన వారి నుంచి పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మోహన్ అల్లుడు చింటూ పేరు వినిపించిందని సమాచారం. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
మొదట ఒకటే, ఎన్నికల తర్వాత గొడవలు
అనురాధ భర్త మోహన్కు చింటూ అల్లుడు అవుతాడు. చిత్తూరు నగర పాలక ఎన్నికలకు ముందు చింటూతో అనురాధ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని చెబుతున్నారు. అనురాధ మేయర్ అయిన తర్వాత విభేదాలు వచ్చాయని సమాచారం.
విభేదాలు, దాడి వెనుక...?
అనురాధ కుటుంబానికి, చింటూకు మధ్య ఎన్నికల తర్వాతనే విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. దాని వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా మార్కెట్ యార్డు గొడవ ఉందని చెబుతున్నారు. ఈ గొడవ వల్లనే ఈ దాడి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
అనురాధ మేయర్ అయ్యాక.. ఇరువురి మధ్య కాంట్రాక్టులు, టెండర్ విషయాల్లో గొడవలు వచ్చి ఉంటాయని చెబుతున్నారు. గతంలో ఈ వర్గాల మధ్య గొడవలు జరిగాయని చెబుతున్నారు. రెండు వర్గాలు ఫ్లెక్సీలు చించేసుకోవడం, రోడ్ల మీద గొడవ వరకు వెళ్లాయని చెబుతున్నారు. అయితే, హత్య వరకు వెళ్తుందని అనుమానించలేదని చెబుతున్నారు. చింటూనే ఈ హత్య వెనుక సూత్రధారి కావొచ్చని చెబుతున్నారు.
లొంగిపోయిన ముగ్గురు నిందితులు వీరే..
అనురాధ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులు లొంగిపోయారు. ఇద్దరు పోలీసు స్టేషన్లో, ఒకరు కోర్టులో లొంగిపోయారు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన వారు కర్నాటక రాష్ట్రంలోని ములబాగల్ ప్రాంతానికి చెందిన వారు అని తెలుస్తోంది. కోర్టులో లొంగిపోయిన వ్యక్తి చౌడేపల్లి వాసి. రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించి హత్య చేశారని తెలుస్తోంది.
మేయర్ భర్తకు ఆపరేషన్
ఘటనలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త మోహన్కు వేలూరు సిఎంసీలో ఆపరేషన్ జరుగుతోంది. ఆయన శరీరంలోకి దూసుకు వెళ్లిన రెండు బుల్లెట్లను వైద్యులు తొలగిస్తున్నారు.
నీటి సమస్యపై కృతజ్ఞతలు చెబుతామని..
రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించిన దుండగులు... మంగళవారం నాడు తమ నీటి సమస్య తీరినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్తున్నామని చెప్పి, మేయర్ కార్యాలయంలోకి వెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు.
చింటూ నివాసం వద్ద వాహనాలు ధ్వంసం
అనురాధ హత్య నేపథ్యంలో మోహన్ సొంత బావమరిది చింటూ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు వాహనాలను ధ్వంసం చేశారు. చింటూనే హత్యకు కారణమంటూ వారు ఆరోపించారు. దీంతో చింటూ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
ఆ కిరాయి హంతకులనే, కలిశారా?
గతంలో ప్రత్యర్థులు వాడుకున్న కిరాయి హంతకులనే ఇప్పుడు చింటూ ఉపయోగించుకున్నాడని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఇంది. మరో విషయమేమంటే.. అనురాధ వర్గానికి, సికె బాబు వర్గానికి వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఆ కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, సికె బాబు వర్గం, చింటూ ఒక్కటయ్యారా అనే కోణంలోను ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
144 సెక్షన్ విధింపు
చిత్తూరు మేయర్ దంపతుల పైన దాడి నేపథ్యంలో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో చిత్తూరులో 144వ సెక్షన్ విధించారు. పలుచోట్ల టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో రత్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో హై అలర్ట్ ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు.
చింటూ... అనురాధ భర్త మోహన్కు బావమరిది అని, మేనల్లుడు అని రెండు రకాలుగా వార్తలు వస్తున్నాయి. రూ.3 లక్షలు ఇవ్వాలని మోహన్ను చింటూ అడిగాడని, డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో చింటూ కక్ష పెంచుకున్నాడని అంటున్నారు. కుట్రలో వెంకటచలపతి, రెడ్డి, మంజనాథ, వెంకటేష్ తదితరులున్నారని తెలుస్తోంది. అనంతపురంలో కొన్న పాయింట్ 32 గన్తో కాల్పులు జరిపారని సమాచారం.