మహిళ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో టిడిపి ఎంపీలు పార్లమెంట్ వెలుపల సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళన సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మహిళ వేషధారణలో వచ్చి నిరసనలో పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళల తరపున తాను మహిళల వేషధారణలో నిరసన వ్యక్తం చేసినట్టు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రకటించారు.
సోమవారం నాడు పార్లమెంట్ ప్రారంభం కావడానికి ముందుగా గాంధీ విగ్రహం ముందు టిడిపి ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో ఆందోళనలు నిర్వహించారు. ఈ సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మహిళ వేషధారణలో వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.
మహిళ ఆకాశంలో సగమని చెబుతుంటారని, ఆంధ్రప్రదేశ్ మహిళగా తాను వచ్చానని, తన రాష్ట్రంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శివప్రసాద్ మీడియాకు చెప్పారు. మహిళల సమస్యలను పరిష్కరించాలని మోదీకి విన్నవిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రజల రక్షణ కోసం మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.
మోడీ అధికారంలోకి రాగానే పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. నగదు నోట్ల కోసం బ్యాంకుల లైన్లలో క్యూలో నిల్చుని అనేక మంది మరణించారని ఆయన గుర్తు చేశారు. మంగళసూత్రానికి ఆధార్కు మోడీ లింక్ పెట్టేందుకు కూడ మోడీ ప్రయత్నించాడని ఆయన ఆరోపణలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ మహిళలు ఆందోళనలు నిర్వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు లాంటి నేతకు ద్రోహం చేస్తే పుట్టగతులుండవని శివప్రసాద్ చెప్పారు.