టీడీపీ కీలక నేత కఠారి ప్రవీణ్ ఆకస్మిక మృతి: చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. టీడీపీ చిత్తూరు నగర కన్వీనర్ కఠారి ప్రవీణ్ సోమవారం మహమ్మారి బారినపడి కన్నుమూశారు.
కరోనా లక్షణాలతో కఠారి ప్రవీణ్ నాలుగు రోజుల క్రితం తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్గా తేలడంతో అక్కడే చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థతో సోమవారం మృతి చెందారు. ఆయన మాజీ మేయర్ మేయర్ కఠారి హేమలతకు భర్త. ఆయన తల్లి అనురాధ కూడా మేయర్గా పనిచేశారు.
తల్లిదండ్రులు కఠారి మోహన్, అనురాధ దంపతులు హత్యకు గురైన అనంతరం చిత్తూరు టీడీపీలో చురుకుగా వ్యవహరిస్తూ కీలక నాయకుడిగా ఎదిగారు కఠారి ప్రవీణ్. ప్రవీణ్ మృతి పార్టీకి తీరని లోటని పార్ఠీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కఠారి ప్రవీణ్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. ప్రవీణ్ మృతి టీడీపీకి తీరని లోటన్నారు. ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
కాగా, తల్లిదండ్రుల సమాధి వద్దే ప్రవీణ్ మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రవీణ్ మృతదేహానికి నివాళులర్పిస్తూ ఎమ్మెల్సీ రాజసింహులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనతోపాటు టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ షణ్ముగం, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బాలాజీ, తదితర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.
ఇది ఇలావుండగా, కరోనా మహమ్మారి బారినపడిన గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేటర్ ఒకరు ప్రాణాలు వదిలారు. జీవీఎంసీ 31 వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేటర్ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.