మరోసారి నోటీసులు జారీచేసిన CID
తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పెద్ద కుమారుడు, పార్టీ నాయకుడైన చింతకాయల విజయ్ కు సీఐడీ మరోసారి నోటీసులు జారీచేసింది. రాజమండ్రి సీఐడీ పోలీసులు నర్సీపట్నంలో ఉన్న విజయ్ ఇంటికి వెళ్లారు. మార్చి 28వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న పోస్టులకు సంబంధించి ఈ నోటీసులు జారీచేశారు. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడికి అందజేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులిస్తున్నారన్నాని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై దుష్ప్రచారం చేశారంటూ చింతకాయల విజయ్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని.. అవి కూడా ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఇందులో విజయ్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ లో ఉన్న విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో నోటీసులు జారీచేసి వచ్చారు.

నర్సీపట్నంలోని ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోర్జరీ ఎన్వోసీ పత్రాలతో మోసం చేశారని అయ్యన్నపాత్రుడి కుటుంబంపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో అయ్యన్నతోపాటు చిన్న కుమారుడు రాజేష్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరైంది. ఇంటి ప్రహరీ నిర్మాణాన్ని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications