అమరావతి భూముల కొనుగోలుపై దూకుడు పెంచిన సీఐడీ: రంగంలోకి ఈడీ కూడా
అమరావతి: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతి భూములపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. నాలుగు వేల ఎకరాల్లో భూముల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక తేల్చిన విషయం తెలిసింది. భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ కొనసాగిస్తోంది.
ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూముల కొనుగోలుపై విచారణ ప్రారంభించిన సీఐడీ.. 790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్ల రేషన్ కార్డు హోల్డర్ కొనుగోలు చేశారు.
అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలంటూ ఇప్పటికే ఈడీకి లేఖ రాసింది సీఐడీ. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఈడీ రంగంలోకి దిగనుంది. భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసింది సీఐడీ.
48వ రోజుకు రాజధాని నిరసనలు..24 గంటల దీక్షకు రైతులు
కాగా, సబ్ కమిటీ నివేదకలో పేర్కొన్న 4వేల ఎకరాల భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువగా టీడీపీ నేతల ఉండటం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, తదితర నేతలకు సంబంధించిన భూములు ఉన్నట్లు ఇప్పటికే వైసీపీ నేత, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
సీఐడీ ప్రధాన కార్యాలయం
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో.. సీఐడీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం కోసం సంబంధిత అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ఇందుకోసం 50 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన భవనం కావాల్సి ఉంటుందని, ఇందుకోసం సీఐడీ డీఐజీ త్రివిక్రమవర్మ నగరానికి వచ్చినట్లు తెలిసింది. మూడు రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తగిన భవనాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సమాచారం.