టీడీపీ నేత రాజా అరెస్ట్ కు సీఐడీ ప్రయత్నం.. చుట్టుముట్టిన కార్యకర్తలు.. అదృశ్యం.. ఎక్కడున్నా పట్టుకుంటాం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల రాజాను అరెస్ట్ చేయడానికి సీఐడీ అధికారులు విఫల ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారి కళ్లుగప్పి అదృశ్యమై ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజా బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేశారని, కోట్లరూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు నమోదైన కేసుల్లో అరెస్ట్ చేయడానికి సీఐడీ అధికారులు ప్రత్తిపాడులోని రాజా ఇంటికి రాగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్న రాజా
సాయంత్రం 5.00 గంటలకు రాజా ఇంటికి చేరుకున్న అధికారులు రాత్రి 9.30 గంటల వరకు ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. నోటీసులిచ్చి అరెస్ట్ చేయడానికి సీఐడీ అధికారులు సిద్ధమవగా విషయం తెలుసుకున్న రాజా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యనమల కృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, వర్మ, కొండబాబు తదితరులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు వద్దని ఆదేశించినా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ సీఐడీ అధికారులతో జ్యోతుల నెహ్రూ వాగ్వాదానికి దిగారు. రాజా ఇంట్లోకి వెళ్లడానికి సీఐడీ అధికారులు ప్రయత్నించినా కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించడంతో వారు లోపలికి వెళ్లలేకపోయారు.
నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా
ఆ తర్వాత విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కరెంటు రాగానే రాజా కుటుంబీకులు తలుపు తెరవడంతో అధికారులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. రాజా లేరు. రాత్రికి ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. లంపకలోవ పీఏసీఎస్ అధ్యక్షుడిగా, డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో లంపకలోవలో రూ.15 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పోలీసులు రాజాపై దర్యాప్తు చేసి కేసు సీఐడీకి అప్పగించారు.
రాజా హైకోర్టును ఆశ్రయించడంతో చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నాలుగుసార్లు నోటీసులిచ్చినా రాజా హాజరుకాలేదు. ''రాజాకు నోటీసులివ్వాలనుకున్నామని, ఆయన ఇంట్లోకి వెళ్లి కరెంటు పోయినప్పుడు తప్పించుకున్నారని, అవకాశం ఇచ్చినా పారిపోయారంటే తప్పు చేసినట్లేనని'' సీఐడీ రాజమండ్రి ఏఎస్సీ వి.గోపాలకృష్ణ అన్నారు.
మరణించిన వ్యక్తి బతికున్నట్లుగా ఫోర్జరీ చేసి పాసు పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని, దర్యాప్తు చేసి న్యాయస్థానానికి నివేదిస్తామని, రాజాను ఎక్కడున్నా పట్టుకుంటామన్నారు.
మైనింగ్ పై పోరాటం చేస్తున్నందుకే..
తనమీద రెండు నెలలుగా కక్ష గట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సెల్ఫీ వీడియోలో రాజా అన్నారు. వారం రోజుల క్రిందట లంపకలోవ విచారణ నివేదికను కోర్టు రద్దుచేసిందని, గండేపల్లి పీఏసీఎస్ అక్రమాల్లో నా పేరుందని, అరెస్ట్ చేస్తున్నామని సీఐడీ వారు చెబుతున్నారన్నారు. నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారని, అక్రమ మైనింగ్ పై పోరాటం చేయకుండా నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రజలంతా తోడుగా ఉండాలని రాజా ఆ వీడియోలో కోరారు.