IndiGo: రామ్మోహన్ బర్తరఫ్ ? మోడీకి వైసీపీ డిమాండ్..! ఇండిగో సంక్షోభం వెనుక ?
ఇండిగో ఎయిర్ లైన్స్ లో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కొన్నిరోజులుగా వేలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో లక్షల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కేంద్రం కూడా చేసేది లేక చోద్యం చూస్తోంది. ఈ నేపథ్యంలో విమానయాన సంక్షోభానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతే కారణమని వైసీపీ ఆరోపించింది.దేశపరువును మంట గలిపిన మంత్రి రామ్మోహన్ నాయుడు అని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.
శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే ఇండిగో సమస్యకు మూలకారణమన్న మార్గాని భరత్.. తక్షణమే రామ్మోహన్ నాయుడుని కేబినెట్ నుంచి తొలగించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఒకవైపు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. జాతీయ మీడియాలో లోకేష్ భజన చేస్తూ.. టీడీపీ అధికార ప్రతినిధులు తెలుగువారి పరువు తీశారని ఆక్షేపించారు.

పర్యావసానాలు ఆలోచించకుండానే ఎఫ్ డీ టీ ఎల్ అమలు చేస్తూ... పైలట్ల విశ్రాంతి సమయం 36 నుంచి 48 గంటలకు పెంచడం వల్లే... ఇండిగోలో పైలట్ల కొరతతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దై సంక్షోభానికి కారణమైందని భరత్ వెల్లడించారు. మరోవైపు ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు భారీగా టిక్కెట్ల రేట్లు పెంచినా... అదుపు చేయలేకపోవడం పౌరవిమానయానశాఖ వైఫల్యమేనన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తుండగా... దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని, ఈ అసమర్థ కేంద్రమంత్రే దీనికి బాధ్యత వహించాలని భరత్ కోరారు. ఇవన్నీ సర్దుకోవడానికి మరో వారం రోజులు పడుతుందన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ గొడ్డు చాకిరీ చేయిస్తుందని, పైలట్లకు విశ్రాంతి సమయం వారం రోజుల్లో 36 గంటలు ఇస్తున్నారన్నారు. ఇందులో మరో దారుణం ఏమిటంటే... ఎవరైనా సెలవు తీసుకుంటే.. దాన్ని కూడా ఆ 36 గంటల్లోనే మినహాయిస్తున్నారన్నారు. అత్యవసరమై ఒకటి రెండు రోజులు సిబ్బందిలో ఎవరైనా లీవ్ తీసుకుంటే.. వారం రోజులు గొడ్డు చాకిరీ చేయాల్సిందే అన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఉంటూ.. ఇన్ని తప్పులు చేస్తూ కనీసం సమీక్షకూడా నిర్వహించకపోవడమే ఈ సమస్యకు కారణమన్నారు.












Click it and Unblock the Notifications