ప్రత్యేక హోదా హుష్కాకి: పవన్ కల్యాణ్ వర్సెస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం అక్షరాలా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమరం జనసేన అధినేత పవన్ కల్యాణ్కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య జరగబోతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇచ్చింది తీసుకుందామని, తర్వాత మిగతా వాటిని అడుగుదామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు.
ఏం చెప్పినప్పటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారనే నమ్మకం లేకుండా పోయింది. ప్రత్యేక హోదా రాష్ట్రంలో ఓ సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ఉద్యమాలకు ప్రజల నుంచి సానుకూల వైఖరి లభించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హోదాపై రేపు (శుక్రవారం) పవన్ కల్యాణ్ కాకినాడలో మాట్లాడనున్నారు. ప్రత్యేక హోదా రాదని స్పష్టత వచ్చిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
కాకినాడ బహిరంగ సభ కోసం కాకినాడలోని జేఎన్టీయూ సిద్ధమైంది. ఈ సభకు దాదాపు లక్ష మంది కార్యకర్తలు హాజరవుతారని తెలుస్తోంది. దీనికి ఆత్మగౌరవ సభగా నామకరణం చేశారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్న పవన్ భావనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలని బిజెపి కాకినాడలో తీర్మానం చేసి రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేయడానికి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా కాకినాడలో సభ ఏర్పాటు చేశారు. కేంద్రం ఏపీకి ప్యాకేజీ ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారిగా ప్రజల ముందుకు వస్తున్నారు. హోదా పేరు లేకుండా హోదా ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలను ఏపీకి అందిస్తామని జైట్లీ ప్రకటించారు.
కానీ హోదా కోసం ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధపడుతున్నాయి. వైయస్ జగన్ శనివారంనాడు బంద్కు పిలుపునిచ్చారు. బహుశా పవన్ కల్యాణ్ బహిరంగ సభను దృష్టిలో పెట్టుకునే ఆయన రేపు కాకుండా ఎల్లుండి బంద్కు పిలుపునిచ్చి ఉంటారు. రేపు బంద్కు పిలుపునిస్తే పవన్ కల్యాణ్ సభను ఆటంకపరిచడానికేనని అంటారనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేసినట్లు కనిపిస్తోంది. ఆ విమర్శ రాకుండా చూసుకోవడానికి ఆయన జాగ్రత్త పడి పదో తేదీన బంద్ను తలపెట్టారని భావించారు.
వైయస్ జగన్కు కాంగ్రెసు మద్దతు లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ను ఎదుర్కుంటూ చంద్రబాబుపై పోరాటం చేయడానికి బలమైన నాయకుడిగా ఉన్న జగన్ను ఆసరా చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసు మద్దతు జగన్కు కూడా అవసరంగా మారిందని చెప్పవచ్చు. బిజెపిపై పోరాటం చేయడానికి ఆ అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. లేదంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని జగన్ అనుకుంటుండవచ్చు.
పవన్ కల్యాణ్పై ఇప్పటికీ అనుమానాలున్నాయి. బిజెపికి మద్దతుగానో, చంద్రబాబుకు మద్దతుగానో మాత్రమే ఆయన రంగంలోకి వచ్చారనే ప్రచారం సాగుతోంది. రేపు మాట్లాడే విధానాన్ని బట్టి పవన్ కల్యాణ్ ఎటు ఉంటారు, స్వతంత్రంగా రంగంలోకి దిగుతారా అనేది తేలే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ను ధీటుగా ఎదుర్కోవడానికి వైయస్ జగన్ తన పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ స్థితిలో చంద్రబాబుకు కష్టాలు తప్పకపోవచ్చునని అంటున్నారు. బిజెపికి కొత్త వచ్చేది గానీ పోయేది గానీ ఏమీ లేదని అంటున్నారు. అయితే, నమ్మకంతో బిజెపిలో చేరిన హేమాహేమీలు మాత్రం నిరాశకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications