ఏపీ, టీ మధ్య మరో రగడ: నల్సార్లో ఏపీ విద్యార్ధులకు సీట్లు లేవు..!
అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ గొవడలోకి హైదరాబాద్లోని నల్సార్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చేరింది. ఏపీ విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ప్రతి అంశాన్ని పదేళ్ల పాటు ఉమ్మడిగానే పరిగణించాలన్న నిబంధనను తెలంగాణ సర్కారు ఉల్లంఘించిందంటూ న్యాయ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లోని నల్సార్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కక పోవడమే వీరి ఆవేదనకు కారణమని తెలుస్తోంది. కాగా, విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్ఎన్ఎల్యూ)లో మాత్రం ఉస్మానియా వర్సిటీ కోటా కింద తెలంగాణ విద్యార్థులకు 37 సీట్లు కేటాయించినట్లు రిజస్ట్రార్ డాక్టర్ దయానందమూర్తి చెప్పారు.
అయితే నల్సార్లో మాత్రం ఇలా చేయలేదని, దీనిపై నల్సార్ రిజస్ట్రార్కు లేఖ రాశామని, దానికి సమాధానం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. దేశంలోని 16 జాతీయ న్యాయ వర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (కామన్ లా అడ్మిషన్ టెస్ట్-క్లాట్) ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు వర్సిటీలు ఉన్నందువల్ల విద్యార్థులకు సమానంగా లేదా ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థులకే ఆయా వర్సిటీల్లో సీట్లు కేటాయింపు జరగాలి. తెలంగాణ సర్కారు నిర్ణయంతో ఏపీ విద్యార్ధులు నష్టపోయారు. జాతీయ ర్యాంకులు సాధించినవారికి హైదరాబాద్లోని నల్సార్లో బీఏఎల్ఎల్బీ ఆనర్స్ సీట్లు అన్ని కేటగిరీలలో కలిపి 56 ఉన్నాయి.
ఇందులో తెలంగాణ విద్యార్థులకు జనరల్లో 11 సీట్లతోపాటు మొత్తం 14 సీట్లను కేటాయించారు. కానీ, ఏపీ విద్యార్థులకు ఎలాంటి సీట్ల కేటాయింపూ జరగలేదు. అలాగే ఎల్ఎల్ఎంలో జాతీయస్థాయి ర్యాంకర్లకు 40, తెలంగాణ విద్యార్థులకు 10 సీట్లను కేటాయించారు. ఇక్కడే తమకు తీరని అన్యాయం జరిగిందని ఏపీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా మాట్లాడుతూ నల్సార్లో ఏపీ విద్యార్ధులకు సీట్లు కేటాయించని సంగతి తమ దృష్టికి వచ్చిందన్నారు. విశాఖలోని డీఎస్ఎన్ఎల్యూలో ఓయూ పరిధికి సంబంధించి, చట్టాన్ని గౌరవిస్తూ తెలంగాణకు సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కానీ తెలంగాణ మాత్రం అలా చేయలేదని, గవర్నర్తో చర్చిస్తామని చెప్పారు.