భగ్గమన్న పాతకక్షలు: కత్తులు, గొడ్డళ్లతో దాడి, ఇద్దరి పరిస్థితి విషమం
అమరావతి: కృష్ణా జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. విజయవాడలోని గూడవల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సర్పంచ్ సాంబశివరావు వర్గం కత్తులు, కర్రలు చేతబట్టి స్వైర విహారం చేసింది.
తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇంటిపై సాంబశివరావు తన అనుచరులతో కలిసి మూకుమ్మడి దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన ప్రజలు కర్రలతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తులు, కర్రలతో సర్పంచ్ వర్గం దాడికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేసి, మళ్లీ ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
గుంటూరులో గొడ్డళ్లతో దాడి:
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య అధిపత్యపోరుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, జిల్లాలోని రెంట చింతల మండలం మంచికల్లులో జరిగిన ఈ ఘటనలో ఇరు వర్గాలు గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకోవడంతో వెంకట నారపరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డెంకాడ ఎంపీపీ కారు దహనం
విజయనగరం జిల్లా డెంకాడ మండల ఎంపీపీ కంది చంద్రశేఖర్ కారును గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి దహనం చేశారు. ఎంపీపీ తెలిపిన వివరాల ప్రకారం అక్కివరంలోని తన నివాసం ముందు పార్క్ చేసిన కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయినట్లు ఆయన పేర్కొన్నారు.
గతేడాది జులై 6న కూడా ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీపీకి చెందిన కారును తగులబెట్టారు. రెండు సంఘటనల నేపథ్యంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications