మిగతా డబ్బులిచ్చి తాళాలు తీసుకువెళ్లండి!!
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాకు సొంత పార్టీలోని నేతల నుంచే నిరసన సెగ తగులుతోంది. నగరి నియోజకవర్గంలో తరుచు ఏదో ఒక కార్యక్రమానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాలని రోజా భావించారు. అయితే వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ససేమిరా అన్నారు. సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రం ఒకే ప్రాంగణంలో నిర్మించారు. వీటిని నిర్మించడానికిరూ.34 లక్షలు ఖర్చయ్యిందని, మరో రూ.23 లక్షలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మురళీధర్ రెడ్డి తెలిపారు. బిల్లులు రాకుండానే ఇంత హడావిడిగా దీన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
బిల్లులు చెల్లించాకే సచివాలయాన్ని ప్రారంభించాలంటూ భవన సముదాయానికి తాళాలు వేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మురళీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రోజా అనుచరులు తాళం పగలగొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు మురళీధర్రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని అరెస్టు చేశారు. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో మంత్రి రోజా పత్తిపుత్తూరు చేరుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
మంత్రి రోజాకు తన నియోజకవర్గం నగరిలో అసమ్మతి నేతల నుంచి తరుచుగా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై ఆమె ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు. రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి రోజా గెలవాలంటే ప్రత్యర్థి పార్టీలకన్నా సొంత పార్టీలోని నాయకులతోనే ఎక్కువగా పోరాడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.