జగన్ కుటుంబంలో ముసలం? ఎప్పుడూ ‘వివేకా’కే ప్రాధాన్యం.. టీడీపీ వైపు బ్రదర్స్ చూపు!?
వైఎస్ జగన్ ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయట. రాజకీయాలు కలిసి రాకపోవడంతో పాటు ఇతర సమస్యలతో సతమతమవుతోన్న జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా సమస్యగా మారారట.
కడప: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయా? మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి కుటుంబ సభ్యులే కారణమా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకీ అసలేమైంది? వారి మధ్య పొరపొచ్చాలు ఎందుకొచ్చాయి?
వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల పెట్టని కోట.. పట్టున్న ప్రాంతం. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయట. ఆ ప్రభావం క్రమేపీ పులివెందులపై పడుతోందట. రాజకీయాలు కలిసి రాకపోవడంతో పాటు ఇతర సమస్యలతో సతమతమవుతోన్న జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా సమస్యగా మారారట.

మూడు ఫ్యామిలీలు మాత్రమే రాజకీయాల్లో...
జగన్ పెదనాన్న, చిన్నాన్న కుటుంబాల్లోని మూడు ఫ్యామిలీలు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు హైదరాబాద్లో స్థిర పడ్డాయి. పులివెందుల్లో జగన్ బాబాయి వివేకానంద రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి కుటుంబాలు రాజకీయాల్లో కొనసాగుతున్నాయి.

అందుబాటులో ఉంటున్నది వీరే...
భాస్కర్ రెడ్డి కుమారుడే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి పులివెందుల మున్సిపల్ ఛైర్మన్గా ఉన్నారు. ఆయన భార్య వైస్ ఛైర్మన్ పదవిలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వరకూ పులివెందుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నది వీరే.

‘వివేకా’కే ప్రాధాన్యం...
అయితే వివేకానందరెడ్డి తన సొంత తమ్ముడు కావడంతో రాజశేఖర్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులిచ్చారని.. తమకు మాత్రం ఆ స్థాయి పదవులు ఇవ్వలేదని భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి కుటుంబాలు కొంత అసంతృప్తితో ఉన్నాయట. వైఎస్ మరణానంతరం ఈ అసంతృప్తి మరింతగా పెరిగిందని, అది గమనించే జగన్ భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డిని ఎంపీని చేశారని చెప్పుకుంటున్నారు.

అవినాష్కు ఎంపీ టికెట్ విషయంలో...
ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావనార్హం. అవినాష్కు కడప ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు జగన్ సోదరి షర్మిల అలక వహించారట. ఆ సమయంలో ఆమెకు జగన్ ఎంతో సర్ధి చెప్పాల్సి వచ్చిందట. అయితే పదవులు వారివే అయినా.. పెత్తనమంతా జగన్ కుటుంబ సభ్యులదే అనే టాక్ కూడా పులివెందులలో వినిపిస్తూ ఉంటుంది.

బతిమాలిన జగన్?
జగన్ కుటుంబ సభ్యులు ప్రతీ చిన్న విషయంలోనూ వేలు పెడుతూ ఉండటంతో మనోహర్ రెడ్డి విసిగిపోయారట. గత ఏడాది మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారట. అది తెలుసుకున్న జగన్ ఆగమేఘాల మీద పులివెందులకు వెళ్లి మనోహర్ రెడ్డిని బతిమాలారని చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications