పదో తరగతి విద్యార్థినికి గర్భం...కీచక టీచర్ ని గుడ్డలూడదీసి కొట్టారు
ఏలూరు:విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కంచే చేనుమేస్తున్న చందంగా విద్యార్థినిలను చెరబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే.
అదే తరహాలో ఏలూరులో ఒక పదో తరగతి విద్యార్థినిని కీచక టీచర్ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేయగా చివరకు ఆ బాలిక గర్భం దాల్చింది. విద్యార్థిని ప్రశ్నించగా ఉపాధ్యాయుడే అందుకు కారణమని తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు అతడిని ఇంట్లో నుంచి బైటకు లాగి గుడ్డలూడదీసి ఊరంతా తిప్పుతూ చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు జనాలను చెదరగొట్టి ఆ కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే...
కర్నూలుకు చెందిన కారె రాంబాబు (38) అనే వ్యక్తి ఆరేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ స్కూల్లో ఇంగ్లీషు, లెక్కలు బోధిస్తున్నాడు. ఆ స్కూల్ లో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన ఒక మైనర్ బాలిక అస్వస్తతకు గురైన క్రమంలో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించి షాక్ తిన్నారు. ప్రస్తుతం ఆ బాలిక పాలిటెక్నిక్ ఫస్టియర్ ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నారు.
కారె రాంబాబు పనిచేస్తున్న స్కూలులో ఈ విద్యార్థిని పదో తరగతి చదువుతుండగా ఈ బాలికపై కన్నేసిన రాంబాబు మాయమాటలు చెప్పి, అనేకసార్లు తన గదికి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడు. అయితే ఇంట్లో తెలిస్తే, తననే కోప్పాడతారని...కొడతారనే భయంతో ఆమె ఆ విషయం బయటకు చెప్పలేదు. అయితే ఇటీవల ఈ బాలిక అస్వస్థతకు గురైన క్రమంలో తమ కుమార్తె గర్భం దాల్చినట్టు ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. అప్పటికే ఆమె ఐదు నెలల గర్భవతి.
దీనిపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆ విద్యార్థినిని ఏం జరిగిందో ఆరా తీసిన పిమ్మట ఉపాధ్యాయుడు రాంబాబు దీనికి కారకుడిగా గుర్తించారు. దీంతో రగిలిపోయిన వారు కారె రాంబాబు నివాసం ఉంటున్న గదిలోకి చొరబడి, అతడిని బయటకు ఈడ్చుకొచ్చారు. ఆ తర్వాత ఒంటి మీద బట్టలు ఊడదీసి...రోడ్డు మీద పడేసి కొట్టడమే కాదు...వీధుల వెంట తిప్పుతూ చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడకు చేరుకొని జనాలను చెదరగొట్టారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన రాంబాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.